Friday, April 26, 2024

Controversy – శ‌వ‌పేటిక డిజైన్ తో పార్ల‌మెంట్ – ఆర్జేడీ ఫైర్

ప‌ట్నా – నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ బీహార్‌లోని లాలు ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్లమెంటు నూతన భవనం డిజైన్‌ను శవపేటికతో పోలుస్తూ ట్వీట్ చేసింది. ఓ వైపు పార్లమెంటు భవనం, మరోవైపు శవపేటిక ఫొటోలను షేర్ చేస్తూ ‘ఏంటిది?’ అని ప్రశ్నించింది. దీనిపై ఆర్జేడీ నేత శక్తి సింగ్ యాదవ్ స్పందిస్తూ ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టేస్తున్నారని చెప్పడమే తమ ఉద్దేశమని అన్నారు. దేశం దీనిని అంగీకరించడం లేదని పేర్కొన్నారు. పార్లమెంటు అనేది ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిదని, చర్చలకు అది స్థానమని వివరించారు.

ఈ ట్వీట్‌పై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అంతే తీవ్రంగా స్పందించింది. పార్లమెంటు భవనాన్ని శవపేటికతో పోల్చిన వారిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఆ పార్టీ నేత సుశీల్ కుమార్ మోడీ అన్నారు. 2024లో ప్రజలు మిమ్మల్ని అదే శవపేటికలో పాతిపెట్టడం ఖాయమని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా హెచ్చరించారు.

శ‌వ‌పేటిక వ్యాఖ్య‌ల‌పై అస‌దుద్దీన్ అభ్యంత‌రం
కొత్త పార్లమెంట్ భవనం శవపేటికలా ఉందంటూ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ‘‘వాళ్లు (ఆర్జేడీ) పార్లమెంటును శవపేటిక అని ఎందుకు పిలుస్తున్నారు? వాళ్లు ఇంకేమైనా మాట్లాడి ఉండొచ్చు. ఇంకేదైనా ఉదాహరణ చెప్పి ఉండొచ్చు. ఈ యాంగిల్ ఎందుకు తీసుకురావాలి?’’ అని ప్రశ్నించారు.
ఆర్జేడీకి స్టాండ్ అంటూ ఏదీ లేదని ఎద్దేవా చేశారు. కొన్నిసార్లు వాళ్లు లౌకికవాదం గురించి చెబుతారని, మరికొన్ని సార్లు బీజేపీతో తెగదెంపులు చేసుకుని బయటికి వచ్చిన నితీశ్ కుమార్ ను ముఖ్యమంత్రిని చేస్తారని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement