Saturday, May 18, 2024

Delhi | కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం.. ఓ ముక్కోణపు ప్రేమ కథ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలది ముక్కోణపు ప్రేమ కథ అని కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి అన్నారు. శనివారం ఢిల్లీలోని పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మూడు పార్టీలపై విరుచుకుపడ్డారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు నేతలను బీజేపీలో చేర్చుకున్నారు. చేరినవారిలో కాంగ్రెస్ మాజీ వైఎస్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, జైపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డి ఉన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు – బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు డా. కే. లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి – తెలంగాణ ఎన్నికల ఇంచార్జి ప్రకాశ్ జవడేకర్ సమక్షంలో ఈ నలుగురు పార్టీలో చేరారు.

వారికి తరుణ్ చుగ్ కండువగా కప్పి స్వాగతించగా, కిషన్ రెడ్డి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా తొలుత మాట్లాడిన బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్.. ఈ చేరికలు కేవలం ఆరంభం మాత్రమేనని, ఇకపై పెద్ద ఎత్తున కొనసాగుతాయని అన్నారు. గత రెండున్నరేళ్లలో పెద్ద సంఖ్యలో వచ్చి చేరారని, ఎన్నికలు సమీపించే కొద్దీ మరింత మంది వస్తారని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలన, విధానాలు, పథకాలు నచ్చి వారంతా చేరుతున్నారని ఆయన చెప్పారు. ఈ చేరిక పార్టీకి బలం చేకూర్చుతుందని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి, అహంకార, కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పించే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని తరుణ్ చుగ్ అన్నారు. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలతో ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయని, కేసిఆర్ పాలన నుంచి ముక్తి లభిస్తుందని అన్నారు. అదే తెలంగాణ ప్రజల అసలైన విజయమని, కచ్చితంగా జరిగి తీరుతుందని అన్నారు.

అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో చేరిన నలుగురు నేతలకు స్వాగతం పలికారు. విద్యార్థి దశలోనే కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్‌యూఐ నుంచి రాజకీయాల్లో ఉన్న రంగారెడ్డి ఆ పార్టీకి దశాబ్దాలుగా విశేష సేవలు అందించారని అన్నారు. ఇంతటి సుదీర్ఘ రాజకీయానుభవాన్ని ఇకపై బీజేపీ ఉపయోగించుకుంటుందని తెలిపారు. మరోవైపు అజాత శత్రువుగా ఉన్న ఆకుల రాజేందర్ కి మంచి పేరుందని, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఆయన సేవలను పార్టీ వినియోగించుకుంటుందని అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో విశేష సేవలు అందించిన బాగారెడ్డి కుమారుడు జైపాల్ రెడ్డి కూడా చేరారని, ఈ కుటుంబానికి మాజీ ప్రధాని ఇందిరా గాంధీతో ఎంతో సాన్నిహిత్యం ఉందని గుర్తుచేశారు. రంగారెడ్డి జిల్లా తాండూరులో పేరున్న కాంగ్రెస్ నేత లక్ష్మారెడ్డి కూడా బీజేపీలో చేరారని చెప్పారు.

తెలంగాణ గ్రామీణ యువతలో బీజేపీకి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని, కేసిఆర్ అహంకార, కుటుంబ పాలన నుంచి తెలంగాణ ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి నాటకం ఆడుతున్నాయని, కాంగ్రెస్‌లో గెలిచిన తర్వాత పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరారని గుర్తుచేశారు. మోడీ సర్కారు మీద ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం మీద ఈ మూడు పార్టీలు సంతకాలు చేశాయని, ఇదే ఆ పార్టీల మధ్య బంధానికి ఉదాహరణ అని ఆరోపించారు. ఎన్నికలకి ముందు, లేదంటే ఎన్నికల తర్వాత కలిసి పనిచేస్తాయని, కలిసే ప్రయాణం చేస్తాయని ఎద్దేవా చేశారు. ఈ మూడు పార్టీల మధ్య ముక్కోణపు ప్రేమ కథ ఈ నడుస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్‌తో బీజేపీ ఏనాడూ కలిసి పనిచేయలేదని, ఆ పార్టీని గద్దె దింపడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని అన్నారు. తెలంగాణ సమాజంలోని సామాన్యులతో పాటు కవులు, కళాకారులు, రచయితలు, తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలు బీజేపీకి మద్దతిస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా సస్పెన్షన్ వేటుకు గురైన జిట్టా బాలకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందన కోరగా.. జిట్టా ఇచ్చే సర్టిఫికేట్ తనకు అవసరం లేదని, ఆయన చేసే ఆరోపణలపై జవాబు చెప్పాల్సిన అవసరం కూడా లేదని కిషన్ రెడ్డి అన్నారు.

- Advertisement -

తెలంగాణ బీజేపీయే ఒరిజినల్ కాంగ్రెస్
ఒక సామాన్య కార్యకర్తను ఎంపీని చేసి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం బీజేపీలోనే సాధ్యమని పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి అన్నారు. కొత్తగా చేరిన నేతలకు కూడా జాతీయ ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించడం చూస్తుంటే బీజేపీయే అసలైన కాంగ్రెస్ అనిపిస్తోందని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఆయారాం, గయారాం వంటి నేతలే రాజ్యమేలుతున్నారని, డబ్బు సంచులతో వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను 1978 నుంచి కాంగ్రెస్ లో ఉన్నానని, నాలుగు దశాబ్దాలుగా పార్టీకి సేవలు అందిస్తూ అనేక పర్యాయాలు రాహుల్ గాంధీని కలిశానని.. కానీ ఆయన్ను ఎప్పుడు కలిసినా సరే కొత్త వ్యక్తిని చూసినట్టే చూస్తారని అన్నారు. డీకే అరుణ వంటి నేతలు బీజేపీలో చేరి, జాతీయ ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను బీజేపీలో చేరితే ఒరిజినల్ కాంగ్రెస్‌లో ఉన్నట్టే ఉందని అన్నారు. ప్రసుతం తెలంగాణ కాంగ్రెస్ డబ్బు సంచులతో వచ్చినవారిని చేర్చుకుని డూప్లికేట్ కాంగ్రెస్‌గా మారిందని విమర్శించారు. ఈ మధ్య ఒక నేత కాంగ్రెస్‌లో చేరితే స్వాతంత్ర్య సమర యోధుడు చేరినట్టు బిల్డప్ ఇస్తున్నారని, సదరు నేత కూడా రెండు పార్టీలతో బేరమాడి చేరిన సంగతి ప్రజలకు తెలుసు అని అన్నారు. సూర్యుడు మరో దిక్కున ఉదయించినా సరే తెలంగాణలో గెలిచేది బీజేపీయేనని రంగారెడ్డి వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement