Wednesday, May 1, 2024

Delhi | చలో హర్ ఘర్.. బీజేపీ 9ఏళ్ల‌ పాలనపై భారీ ప్రచారం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో తొమ్మిదేళ్ల ఎన్డీయే పాలనపై భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలకు భారతీయ జనతా పార్టీ శ్రీకారం చుట్టింది. తొమ్మిదేళ్ల పాలన, సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం పేరుతో దేశ వ్యాప్తంగా ర్యాలీలు, సభలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ వెల్లడించారు. మంగళవారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… రాజస్థాన్‌లోని అజ్మీర్ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెడతారని తెలిపారు.

ఈ సభలో పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీనడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు పాల్గొంటారని చెప్పారు. మొత్తంగా దేశవ్యాప్తంగా 500కు పైగా భారీ సభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు రిపోర్ట్ కార్డుతో ప్రజల ముందుకు, మీడియా ముందుకు వెళ్తామని చెప్పారు. అలాగే 5 లక్షల మంది ప్రముఖులు, స్వతంత్ర సమరయోధులు దగ్గరకు పార్టీ నేతలు, ఎంపీలు వెళ్తారని తెలిపారు. మొత్తంగా దేశవ్యాప్తంగా 144 క్లస్టర్లుగా విభజించి ప్రతి క్లస్టర్‌లో 3 నుంచి 4 లోక్‌సభ స్థానాలు ఉండేలా ప్రచార ప్రణాళిక రూపొందించినట్టు చెప్పారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో కనీసం 1,000 మంది ప్రముఖులను కలిసి 9 ఏళ్ల పాలన విజయాలను వివరిస్తామని అన్నారు.

ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి ఒక ప్రముఖమైన అభివృద్ధి కార్యక్రమాన్ని చెప్పటం, దాని ఆధారంగా స్థానిక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. జూన్ 3 నుంచి జూన్ 30 వరకు బూత్ స్థాయిలో ప్రతి ఇంటికి బీజేపీ కార్యకర్తలు వెళ్లి ప్రచారం చేస్తారని అన్నారు. యువత, మహిళలు ఇలా అన్ని రంగాల ప్రజలను కలిసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. 10 లక్షల మంది కార్యకర్తలతో డిజిటల్ ర్యాలీ నిర్వహిస్తామని, 16 లక్షల మంది కార్యకర్తలతో నేరుగా ప్రజలతో మమేకం అవుతామని అన్నారు. వచ్చే నెల రోజుల్లో ప్రతి బీజేపీ కార్యకర్త ప్రతి ఒక్కరినీ కలుసుకుంటారని తరుణ్ చుగ్ అన్నారు.

- Advertisement -

బీజేపీ 9 ఏళ్ల పాలనను సమర్ధించేవారు మిస్ కాల్ ఇవ్వడం కోసం ప్రత్యేకంగా నెంబర్ (9090902024) ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన రోజు, శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి ఎంపీ తన సొంత నియోజకవర్గం కాకుండా తనకి కేటాయించిన నియోజకవర్గంలో కనీసం 8 రోజులు పనిచేయాల్సి ఉంటుందని తరుణ్ చుగ్ చెప్పారు. మోడీ నేతృత్వంలో అవినీతి రహిత పాలన అందిస్తున్నామని, కేంద్రం రూపాయి పంపిస్తే ప్రజలకు పూర్తి రూపాయి అందుతుందని చెప్పారు.

గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రూపాయి పంపిస్తే 14 పైసలు మాత్రమే ప్రజలకు చేరేదని గుర్తుచేశారు. తొమ్మిదేళ్లలో అనేక మార్పులు తీసుకొచ్చామని, అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తి కావస్తోందని చెప్పారు. ట్రిపుల్ తలాఖ్ రద్దు చేశామని గుర్తుచేశారు. ఉగ్రవాద దాడులు జరిగితే తెల్ల జెండా చూపించి క్రికెట్ మ్యాచ్లు నిర్వహించే ప్రభుత్వం తమది కాదని, సర్జికల్ స్ట్రైక్స్ చేసే ప్రభుత్వమని చెప్పారు. విద్య, వైద్య, మౌలిక సదుపాయాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చామని వెల్లడించారు. కోట్లాది మంది పేదల సొంతింటి కల సాకారం చేయడంతో పాటు తొమ్మిదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement