Monday, April 29, 2024

TS | డీజీపీని కలిసిన బీఆర్ఎస్ మహిళా నేతలు.. ఆ ఘటనపై చర్యలకు డిమాండ్

బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళా నేతలు కొందరు డీజీపీ రవి గుప్తాను కలిశారు. ఇల్లందు మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానం సందర్భంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లపై జరిగిన దాడి, కిడ్నాప్ ల ఘటనల విషయంలో దోషులపై వెంటనే చర్యలు తీసుకోవాలని నేతలు డీజీపీ రవి గుప్తాను కోరారు. ఈ మేరకు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ తదితరులు మంగళవారం డీజీపీని హైదరాబాద్ లో కలిశారు.

డీజీపీ రవి గుప్తాను కలిసి పూర్తి ఆధారాలతో బీఆర్ఎస్ మహిళలు ఫిర్యాదు చేశారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లపై కాంగ్రెస్ నేతలు దాడులు చేశారని, కిడ్నాప్ లు కూడా చేశారని ఆరోపించారు. ఆ ఘటనల విషయంలో నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని నేతలు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరుగుతున్న మహిళలపై దాడుల విషయంలోనూ చర్యలు తీసుకోవాలని నేతలు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement