Wednesday, May 1, 2024

Delhi: తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాం, జేపీ నడ్డా సమక్షంలో చేరిన ఎర్రబెల్లి ప్రదీప్‌రావు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు, వరంగల్‌ అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్ అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు తెలిపారు. ఇటీవల టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన ఆయన గురువారం సాయంత్రం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు నేతృత్వంలో ప్రదీప్‌రావుతో పాటు మరికొందరు బీజేపీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ వారికి పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఇవ్వగా, నడ్డా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. తెలంగాణలో ఇప్పుడు బీజేపీకి మంచి మూమెంట్ ఉందన్న ఆయన, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశానికి ప్రపంచ ఖ్యాతి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2018 ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నుంచి ఎమ్మెల్యే టికెట్, తర్వాత ఎమ్మెల్సీ పదవి ఆశించి భంగపడిన ప్రదీప్‌రావు అప్పటి నుంచి టీఆర్ఎస్‌ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయ వేడి పెరుగుతుండడంతో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంలో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. దీంతో ఆపరేషన్ ఆకర్ష్‌లో చేరే కొత్త పేర్లు ఏవనే చర్చ సాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement