Monday, April 29, 2024

Boycott – పార్ల‌మెంట్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి విప‌క్షాలు దూరం ..

న్యూఢిల్లీలో జరిగే భారత పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాలు దూరంగా ఉండాల‌ని నిర్ణయించుకున్నాయి. ఈ వేడుకల‌ను బహిష్కరిస్తున్నట్టు తేల్చి చెప్పాయి. పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), తృణమూల్ కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే), వామపక్షాలు, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ), జనతాదళ్-యునైటెడ్ (జేడీయూ), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), సమాజ్ వాదీ పార్టీ, ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన వర్గం పాల్గొనబోమని బుధవారం నాడు సంయుక్తంగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బదులుగా ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రారంభించడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. అలాగే జాతిపిత మహాత్మాగాంధీకి భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్న, సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపిన తర్వాత బ్రిటీష్ వారికి జీవితాంతం అండగా ఉంటామని హామీ ఇచ్చిన హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని పలు పార్టీలు తప్పుబడుతున్నాయి.


‘‘రాష్ట్రపతి ముర్మును పూర్తిగా పక్కనపెట్టి కొత్త పార్లమెంటు భవనాన్ని తానే ప్రారంభించాలని ప్రధాని మోడీ నిర్ణయించడం తీవ్రమైన అవమానమే కాదు, ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి. ఈ అమానవీయ చర్య రాష్ట్రపతి ఉన్నత పదవిని అవమానించడమే కాకుండా రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘిస్తుంది. దేశం తన తొలి మహిళా ఆదివాసీ రాష్ట్రపతి నియమించుకున్న వేళ చేరిక స్ఫూర్తిని ఇది దెబ్బతీస్తుంది’’ అని ప్రతిపక్షాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.
‘‘పార్లమెంటును నిరంతరం నిర్వీర్యం చేస్తున్న ప్రధానికి అప్రజాస్వామిక చర్యలు కొత్తేమీ కాదు. భారత ప్రజల సమస్యలను లేవనెత్తిన ప్రతిపక్ష ఎంపీలపై అనర్హత వేటు వేయడం, సస్పెండ్ చేయడం, మౌనం వహించడం… ప్రజాస్వామ్య ఆత్మను పార్లమెంటు నుంచి లాక్కున్నప్పుడే కొత్త భవనంలో మాకు విలువ లేకుండా పోయింది’’ అని తెలిపారు.
దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందిస్తూ, . ‘‘మేము ప్రతి ఒక్కరినీ ఆహ్వానించాము. ఇక వారు వారి విజ్ఞత ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చు’’ అని అన్నారు. ఇదే స‌మ‌యంలో ఈ వేడుకలను బహిష్కరించే నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు పునరాలోచించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కోరారు.
ఇక బిజెపి ప్ర‌భుత్వంపై ఒంటికాలి మీద లేచే బిఆర్ఎస్ పార్టీ మాత్రం త‌మ నిర్ణ‌యాన్ని రేపు ప్ర‌క‌టిస్తామ‌ని పేర్కొంది.. కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నానికి బాబా సాహెబ్ అంబెద్క‌ర్ పేరు పెట్టాల‌ని బిఆర్ఎస్ పార్టీ గ‌త కొంత కాలంగా డిమాండ్ ను వినిపిస్తున్న‌ది.. దీనిపై కేంద్ర నుంచి నేటి వ‌ర‌కూ ఎటువంటి స్పంద‌న లేదు..

Advertisement

తాజా వార్తలు

Advertisement