Thursday, April 25, 2024

క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులను సద్వినియోగం చేసుకోవాలి.. మేయర్ విజయలక్ష్మి

హైద‌రాబాద్, మే 24 (ప్ర‌భ న్యూస్) : జిహెచ్ఎంసి అన్ని జోన్లలో సర్కిళ్ల వారీగా పారిశుధ్య కార్మికులకు క్యాన్సర్ డిటెక్షన్ (గుర్తింపు) ను సి.ఎస్.ఆర్ కింద కార్కినోస్ కార్పొరేట్ బాడీ భాగస్వామ్యంతో నిర్వహిస్తుందని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. బుధవారం బంజారాహిల్స్ రోడ్ నెం.12 సి.ఎం.టి.ఇ.ఎస్ ఆఫీస్ లో పారిశుధ్య కార్మికులకు కార్కినోస్ ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ… జిహెచ్ఎంసి ప్రతి సర్కిల్ లో ఆరు రోజుల పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులను మధ్యాహ్నం 12 గంటల నుండి నిర్వహిస్తారని తెలిపారు. పారిశుధ్య కార్మికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేయర్ తెలిపారు. పారిశుధ్య కార్మికులు క్యాన్సర్ టెస్టుల కోసం ప్రైవేట్ ఆసుపత్రుల వద్దకు వెళ్లకూడదని, ప్రభుత్వ ఆసుపత్రులు, ఇ.ఎస్.ఐ ఆస్పత్రి లో టెస్టులు చేయించుకోవాలన్నారు. క్యాన్సర్ వైద్యం ఖరీదైనది.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరి తమ డబ్బులు వృధా చేసుకోకూడదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పారిశుధ్య కార్మికుల కోసం ప్రత్యేకంగా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసిందని తెలిపారు. బస్తీ దవాఖానాల్లో 40 రకాల టెస్టులను ఉచితంగా చేస్తున్నారని, అదే ప్రైవేట్ లో అయితే అత్యంత ఖరీదైనదన్నారు. బంజారాహిల్స్ ఎన్.బి.టి నగర్, ఎన్.బి నగర్ లో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

జిహెచ్ఎంసి కార్మికులు క్యాన్సర్ నిర్ధారణ అయినచో వారి బంధువుల ద్వారా సమాచారాన్ని మేయర్ క్యాంపు కార్యాలయంకు గానీ, జోనల్, డిప్యూటీ కమిషనర్ కు వెంటనే తెలియజేస్తే తగు చర్యలు తీసుకుంటారని తెలిపారు. కార్కినోస్ ద్వారా డయాగ్నోస్ చేయబడిన అనంతరం బయాప్సి ఆధారంగా సంబంధిత ఆసుపత్రిలో రెఫర్ చేసి వైద్యం చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్కినోస్ ద్వారా ఆరురకాల క్యాన్సర్ కారక వ్యాధులను గుర్తిస్తారని తెలిపారు. క్యాన్సర్ వ్యాధికి అన్ని రకాల మందులు వచ్చాయని, ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని తెలిపారు. జిహెచ్ఎంసి పారిశుధ్య కార్మికుల సంరక్షణ కోసం ప్రతి సంవత్సరం కిట్ లను అందజేస్తున్నామని తెలిపారు. ప్రతిఒక్కరూ తమకు కేటాయించిన డ్రెస్ లను క్రమం తప్పకుండా ధరించేలా చూడాలని ఎస్.ఎఫ్.ఏ లను ఆదేశించారు. పారిశుధ్య కార్మికులు ఉదయం 5:45 గంటలకు రోడ్లు ఊడ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాలని, బయోమెట్రిక్ పాటించాలని తెలిపారు. తమ విధులు నిర్వహించిన అనంతరం క్యాన్సర్ టెస్టుల కేంద్రాలకు హాజరు కావాలని తెలిపారు. కార్కినోస్ ద్వారా చేపడుతున్న క్యాన్సర్ స్క్రినింగ్ ను సి.ఎం.ఓ.హెచ్, ఏ.ఎం.ఓ.హెచ్ లు సమన్వయం చేసుకోవాలన్నారు. కార్కినోస్ ద్వారా గుర్తించిన ఆరోగ్య సమాచారాన్ని నెల రోజుల్లో సమర్పించాలని కోరారు. కార్కినోస్ కు కావాల్సిన రిసోర్స్ పర్సన్ ను జిహెచ్ఎంసి అందిస్తుందని తెలిపారు. 

కార్కినోస్‌లో సలహాదారు డాక్టర్ శ్రీరాం సిప్లా మాట్లాడుతూ… క్యాన్సర్ నివారణకు విలక్షణమైన, అందుబాటు ధరలో క్యాన్సర్ సంరక్షణను అందించే విశ్వనాథ్ క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ తో భాగస్వామ్య మిషన్‌లో కలిసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో భాగస్వామ్యం అవుతున్నామన్నారు. పారిశుధ్య కార్మికుల ఆరోగ్యంపై దృష్టి పెట్టి క్యాన్సర్ అవగాహన  పెంపొందించడం, ముందస్తుగా గుర్తించడాన్ని ప్రోత్సహించడం, జీహెచ్ఎంసీ కార్మికుల శ్రేయస్సు పెంపొందించడం జరుగుతుందన్నారు. క్యాన్సర్ సంరక్షణపై సానుకూల ప్రభావాలు చూపడం, సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందించే జనాభా మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సును మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కార్కినోస్ ద్వారా రిస్క్ అసెస్మెంట్ డిజిటల్ ఫ్లాట్ ఫాం, మేనేజ్డ్ కేర్ సస్పెక్టడ్ విక్టిమ్స్ ఎర్లీ డిటెక్షన్ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవికిరణ్, డిప్యూటీ కమిషనర్ రజనీకాంత్, సి.ఎం.ఓ.హెచ్ పద్మజ, అంకాలజిస్ట్ డా.స్రవంతి, డా.కామాక్షి, డా.సనా ఫాతిమా, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement