Saturday, May 4, 2024

ఎన్నికల కోసం దేవుళ్ల‌ను వాడుకునే బీజేపీ ఎంపీలు.. ధర్మాన్ని కాపాడే నిజమైన హిందువు కేసీఆర్: మంత్రి గంగుల‌

కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ రాముడిని ఎన్నికల కోసం వాడుకుంటున్నారని, నిజంగా ధర్మాన్ని కాపాడే వారే అయితే కొండగట్టు ఆలయ అభివృద్ధికి వంద కోట్ల నిధులు తేవాలని మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు కొండగట్టు పర్యటనకు వస్తున్న సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణ ప్రజలకు సెంటిమెంట్ అయిన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం అయినందున ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధికి వంద కోట్ల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు.

దేవాలయాల అభివృద్ధికి వందల కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ అసలైన హిందూ ధర్మాన్ని కాపాడేది అని అన్నారు. సంజయ్ అరవింద్ రాముడి పేరు చెప్పి ఎంపీలు అయ్యారని, ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఏ ఒక్క దేవాలయ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తేలేదని మండిప‌డ్డారు. నిజంగా హిందువులు అయితే తాము ఇచ్చే నిధులకు తోడుగా100 కోట్లు తేవాలని అప్పుడే నిజమైన హిందువులుగా చూస్తాం అని అన్నారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ మరింత తగ్గిందని బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల కోసం దేవుళ్ళను వాడుకుంటున్న బీజేపీ నాయకులను రానున్న ఎన్నికల్లో నిలదీస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement