Thursday, May 2, 2024

రాబోయే 25ఏళ్లు బీజేపీదే, లక్ష్యసాధనకోసం శ్రమించాలి.. బీజేపీ పదాధికారుల భేటీలో ప్రధాని మోడీ..

దేశాభివృద్ధిని అడ్డుకునేందుకు విష ప్రయత్నాలు జరుగుతున్నాయని.. వారి ఉచ్చులో పడొదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. వారిని పట్టించుకోకుండా దేశ ప్రయోజనాల కోసం పనిచేయాలని భాజపా పదాధికారులకు సూచించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజస్థాన్‌ జైపూర్‌లో జరుగుతున్న భాజపా జాతీయ పదాధికారుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రసంగించారు. 8 ఏళ్ల భాజపా పాలన పేదల సంక్షేమానికి, సామాజిక సామాజిక న్యాయం, సామాజిక భద్రత, సుపరిపాలనకు ఎంతో కృషి చేసిందన్నారు. చిన్నరైతులు, కూలీలు, మధ్యతరగతి ప్రజల ఆశలు ఎనిమిదేళ్లలో నెరవేరాయని ప్రధాని మోడీ అన్నారు. ఈ ఎనిమిదేళ్లు తల్లులు, కుమార్తెలు, సోదరీమణుల సాధికారత కోసం అంకితభావంతో పనిచేశామన్నారు. భాజపా అంటే దేశ ప్రజలకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. దీంతో దేశ ప్రజలంతా ఎంతో విశ్వాసంతో, ఆశగా ఎదురు చూస్తున్నారు.

కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. దీనికై చిన్న చిన్న ఉద్రిక్త ఘటనల కోసం వెతుకుతున్నాయని ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కుటుంబ పార్టీలపై నిరంతరం పోరాటం చేయాలన్నారు. భారత్‌కు ఉన్న సవాళ్లను అధిగమించేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోందని తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంతో రాబోయే 25 ఏళ్లకు లక్ష్యాలను నిర్దేశించాల్సిన ఆవశ్యకత బీజేపీపై ఉందన్నారు. వాటి కోసం నిరంతరం శ్రమించాల్సిన సమయం బీజేపీకి ఇదేనని పేర్కొన్నారు. వచ్చే 25 ఏళ్లపాటు తామే అధికారంలో ఉండాలని భావిస్తున్నట్టు మోడీ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారులకు అందేలా కార్యక్రమాన్ని రూపొందించాలని కోరారు. దీని కోసం అన్ని చోట్ల ప్రచారం ప్రారంభించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. 2014 తర్వాత దేశ ప్రజలు నైరాశ్యం నుంచి బయటపడ్డారని.. నేడు ప్రజలు ఎన్నో ఆకాంక్షలతో ఉన్నారని మోడీ చెప్పారు. వారి ఆశలు నెరవేర్చాల్సిన బాధ్యత మనపై ఉందని పదాధికారులకు సూచించారు. ప్రభుత్వ వ్యవస్థలపై అంతకుముందు ప్రజలు కోల్పోయిన విశ్వాసాన్ని భాజపా మళ్లిd తీసుకువచ్చిందన్నారు. నేడు ప్రపంచమంతా భారత్‌ వైపు ఆసక్తిగా చూస్తోందన్నారు.

భాషా వైవిధ్యం భారత్‌కు గర్వకారణం..

భాషా వైవిధ్యం భారత దేశానికి గర్వకారణమని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. భాషల ప్రాతిపదికపై వివాదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుత్తున్నాయన్నారు. ప్రతి ప్రాంతీయ భాషలోనూ భారతీయ సంస్కృతి ప్రతిబింబాన్ని బీజేపీ చూస్తోందని, అవి పూజించదగినవని పరిగణిస్తుందని చెప్పారు. భారత దేశ మెరుగైన భవిష్యత్తుకు ఇది అనుసంధానమని తెలిపారు. అన్ని ప్రాంతీయ భాషలకు జాతీయ విద్యా విధానం ప్రాధాన్యమిచ్చిందన్నారు. ప్రాంతీయ భాషల పట్ల మన నిబద్ధతకు ఇది నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా, పలువురు సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement