Monday, April 29, 2024

ఖ‌ర్గే హ‌త్య‌కు బిజెపి కుట్ర – ఆడియో టేపులు విడుద‌ల చేసిన కాంగ్రెస్

బెంగళూరు: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను హతమార్చేందుకు భాజపా అభ్యర్థి కుట్ర పన్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేర‌కు ఆడియోను పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్‌ సూర్జేవాలా విడుదల చేశారు. ఈ ఆడియో టేపుల‌లో
కర్ణాటకలోని కలబురగి జిల్లా చిత్తాపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థి మణికంఠ రాథోడ్‌ మాట్లాడినట్లుగా ఉంది.. ‘ఖర్గేతో పాటు ఆయన భార్య, పిల్లలను కూడా అంతమొందిస్తా’ అని రాథోడ్‌ కన్నడలో అన్నట్లుగా ఆడియో ఉంది. దీనిపై ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సూర్జేవాలా మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటమి భయంతో హత్యకు సైతం భాజపా నేతలు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కన్నడ ప్రజలు కాంగ్రెస్‌పై చూపుతున్న అభిమానాన్ని జీర్ణించుకోలేక చివరికి హత్యా రాజకీయాలకు సైతం భాజపా తెరలేపిందని సూర్జేవాలా ఆరోపించారు. రాథోడ్‌కు ప్రధాని మోడీ, సీఎం బసవరాజ్‌ బొమ్మై అండదండలు కూడా ఉన్నాయని అన్నారు.

కాగా,తనపై కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలను రాథోడ్‌ ఖండించారు. కాంగ్రెస్‌ చెప్తున్నవన్నీ అబద్ధమని, అది ఓ ఫేక్‌ ఆడియోగా కొట్టిపారేశారు. ఓటమి భయంతోనే లేని అభాండాలు మోపుతున్నారని ఆరోపించారు. చిత్తాపూర్‌ నియోజకవర్గం నుంచి ఖర్గే తనయుడు ప్రియాంక్‌ ఖర్గే పోటీ చేస్తుండగా ఆయనపై 26 ఏళ్ల మణికంఠ రాథోడ్‌ను భాజపా బరిలో నిలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement