Monday, April 29, 2024

ఏపీలో రోడ్ల పేరుతో పెద్ద స్కాం నడుస్తోంది: నాదెండ్ల మనోహర్

జగన్ ప్రభుత్వంపై జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ భారీ విమర్శలు చేశారు. ఏపీ వ్యాప్తంగా 3,600 కిలో మీటర్లు జగన్ పాదయాత్ర చేశారు… మరి ఇప్పుడు రోడ్ల దుస్థితిపై ఎందుకు పాదయాత్ర చేయరు? అని ఆయన ప్రశ్నించారు. ఏపీలో దెబ్బతిన్న రోడ్లను బాగు చేయాల్సిన బాధ్యత లేదా? అని నిలదీశారు. ప్రతిపక్షాలు, ప్రజలు ప్రశ్నించకుండా పోలీసులను అడ్డం పెట్టుకుని సిఎం జగన్ ముందుకు వెళుతున్నారని నాదెండ్ల మండిపడ్డారు.

శుక్రవారం జనసేన రాష్ట్ర నేతలతో నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా జనసేన ఫర్ ఏపీ రోడ్స్ పేరుతో రోడ్ల పరిశీలన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… ఏపీలో ఎప్పుడూ ఇలాంటి దుస్థితి చూడలేదన్నారు. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారన్నారు. లక్షా 26వేల కిలో మీటర్ల రాష్ట్ర రహదారులు దెబ్బతిన్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా చలనం లేదన్నారు. రూ.12,450కోట్ల రూపాయలు రహదారులు బాగు కోసం కేటాయించారు. 1340 కోట్ల టెండర్లు పిలిచామని గొప్పలు చెప్పుకుంటున్నారు. మరి పనులు ఎక్కడ… కాంట్రాక్టర్లు ఏరి? ఇది కూడా పెద్ద స్కాంగా మేము అనుమానిస్తున్నామని నాదెండ్ల ఆరోపించారు.

మంత్రులు, ప్రజాప్రతినిధులు నిత్యం ఇదే రోడ్లపై ప్రయాణిస్తున్నా గోతులు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ‘వాహన మిత్ర స్కీం పెట్టి పది‌వేలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఈ రోడ్ల వల్ల వాహనాలు దెబ్బ తిని మూడింతలు ఎక్కువ ఖర్చు అవుతుంది’ అన్నారు. తమ కార్యకర్త ప్లకార్డు చేతబడితే కేసులు పెట్టారని.. రోడ్ల పరిస్థితిపై వీడియోలు తీసి మీడియా ద్వారా ప్రజలకు చెప్పాలని తమ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించారని తెలిపారు. సెప్టెంబర్ 2, 3, 4తేదీలలో ఈ వీడియోలు ప్రదర్శిస్తామన్నారు. ఆ తరువాత ప్రభుత్వం స్పందించాలని నెల రోజుల పాటు వేచి చూస్తామని, అప్పటికీ స్పందించకుంటే అక్టోబర్ 2వ తేదీ నుండి జనసేన అధ్యక్షుడు నుంచి జన సైనికుల వరకు అందరూ రోడ్లను శ్రమదానంతో బాగు చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలు వరుసగా ఉంటాయన్నారు. జనసేన ఫర్ ఏపీ రోడ్స్ పేరుతో రోడ్లను పరిశీలించి ప్రజలకు చూపిస్తామని నాదెండ్ల మనోహర్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement