Friday, May 10, 2024

పోలీసు ఉద్యోగాలకు భలే క్రేజ్‌.. 2 రోజుల్లోనే 32 వేల మంది దరఖాస్తు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రెండు రోజుల్లోనే పోలీసు ఉద్యోగాల కోసం 32 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్‌లకుగాను రాష్ట్ర పోలీసు ఉద్యోగాల నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్బీ) సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ ప్రారంభమైంది. పోలీస్‌, ఎక్సైజ్‌, రవాణాశాఖల్లో వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 17,291 పోస్టుల భర్తీకి పోలీస్‌ నియామక మండలి ఆరు నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకుగాను కేవలం రెండు రోజుల్లోనే అభ్యర్థులు ఇంత పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకోవడం ఇదే తొలిసారని టీఎస్‌ఎల్పీఆర్బీ చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 20న రాత్రి పది గంటల వరకు గడువు ఉంది.

అయితే, చివరి రోజుల్లో దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉండడంతో అభ్యర్థులు ముందు నుంచే దరఖాస్తు చేసుకోవడంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారన్నారు. గతానికి భిన్నంగా తొలి రెండు రోజుల్లోనే 32 వేల దరఖాస్తులు చేరడం పోలీసు ఉద్యోగాల పట్ల అభ్యర్థుల్లో నెలకొన్న పోటీకి నిదర్శనంగా కనిపిస్తోందని శ్రీనివాసరావు అన్నారు. దరఖాస్తు చేస్తున్న అభ్యర్థుల సంఖ్యకు తగ్గట్లు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియలో ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా టీఎస్‌ఎల్పీఆర్బీ అన్ని ఏర్పాట్లు చేసిందని ఆయన తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement