బెంగళూరు రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న ఉద్యాన్ ఎక్స్ప్రెస్ రైలులో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు వ్యాపించిన సమయంలో రైలులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది
అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వెళ్లి, మంటలను ఆర్పేశారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియలేదు.సౌత్ వెస్టర్న్ రైల్వే పీఆర్ఓ అనీశ్ హెగ్డే తెలిపిన వివరాల ప్రకారం, బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రాయణ్ణ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారమ్ నంబర్ 3పైకి ఉద్యాన్ ఎక్స్ప్రెస్ రైలు శనివారం ఉదయం 5.45 గంటలకు చేరుకుంది. ఆగి ఉన్న ఈ రైలులోని B1, B2 బోగీలలో ఉదయం సుమారు 7.10 గంటలకు మంటలు చెలరేగాయి. ఉదయం సుమారు 7.35 గంటలకు అగ్నిమాపక సిబ్బంది చేరుకుని, మంటలను ఆదుపు చేశారు.
అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ఈ ప్రమాదానికి కారణాలేమిటో తెలియవలసి ఉంది.ఈ రైలులో మంటలు చెలరేగడంతో రైల్వే స్టేషన్లోని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇక్కడి పొగలు మెజెస్టిక్ బస్టాండ్లోకి కూడా కనిపించాయి. ఈ ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభమైందని రైల్వే అధికారులు తెలిపారు