Saturday, May 4, 2024

ఎవెన్యూ ప్లాంటేషన్‌కు ప్రాధాన్యమివ్వాలి : మంత్రి హ‌రీశ్ రావు

సిద్ధిపేట : నాటి ఎమ్మెల్యేగా.. నేటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి అంకురార్పణ చేసి నేటి హరిత నిధి ఏర్పాటుకు వేదికగా సిద్ధిపేట ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. శుక్రవారం సిద్ధిపేట శివారు తేజోవనం అర్బన్ ఫారెస్ట్ పార్కు మర్పడగలో సెంట్రల్ – మెగా నర్సరీ, ఆ తర్వాత సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ హరిత నిధి నర్సరీ, అనంతరం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ క్వార్టర్స్-3 లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎవెన్యూ ప్లాంటేషన్ కు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. 50 లక్షల మొక్కల సామర్థ్యంతో సెంట్రల్ నర్సరీ ఏర్పాటు, మూడేళ్ల‌ పేరిట రూ.5 కోట్ల 85 లక్షల నిధి కేటాయింపు చేసుకున్నట్లు పేర్కొన్నారు. సిద్ధిపేట జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకూ, పట్టణ ప్రాంతాలకు అవసరమైన పండ్లు, పూల, బ్యూటిఫికేషన్ మొక్కలు పెంచి ఈ ప్రాంతం నుంచి వేరే దగ్గరకు పోకుండా ఇక్కడే లభించేలా ఈ మెగా నర్సరీ నిర్వహణ ఉండాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. తేజోవనం అర్బన్ పార్కులో నర్సరీలో పడిపోయిన ఆకులతో వర్మీ కంపోస్టు తయారు చేయాలని సూచించారు. సిద్ధిపేట జిల్లా హరిత నిధి 50 లక్షల మొక్కల సామర్థ్యం కలిగి 5 కోట్ల 85 లక్షలతో మూడేళ్లకు సరిపోయే సెంట్రల్ నర్సరీ ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని తెలిపారు. చింతమడక అర్బన్ పార్కు, గజ్వేల్ కల్పక వనం అర్బన్ పార్కు అభివృద్ధి అంశాలపై అటవీ అధికారులు మంత్రికి వివరించారు. ఈ మేరకు అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫారెస్ట్ డెవలప్మెంట్ ఫోటో సెషన్ తిలకించి, పలు సలహాలు, సూచనలు చేశారు. మంత్రి వెంట జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, రాజన్న సర్కిల్ సీసీఎఫ్- ఐఎఫ్ఎస్ బీ.సైదులు, సిద్ధిపేట జిల్లా అటవీ శాఖ అధికారి కొత్తపల్లి శ్రీనివాస్, సిద్ధిపేట అటవీ క్షేత్రాధికారి సయ్యద్ ఇక్రముద్దీన్, ఇతర అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement