Wednesday, May 1, 2024

హుబ్లీ ఠాణాపై దాడి, 12 మంది పోలీసులకు గాయాలు

ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా సోషల్‌మీడియాలో చేసిన పోస్టు కర్ణాటకలోని హుబ్లిdలో హింసకు దారితీసింది. ఓ వర్గాన్ని వ్యతిరేకిస్తూ సోషల్‌ మీడియాలో ఓ వ్యక్తి పోస్ట్‌ చేశారు. దీంతో ఆ వర్గీయులు నిరసన వ్యక్తం చేశారు. వివాదాస్పద పోస్ట్‌ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయినా ఓ వర్గం శాంతించలేదు. హుబ్లీ పోలీస్‌ స్టేషన్‌పై రాత్రి సమయంలో దాడికి దిగారు. రాళ్లు రువ్వారు. అక్కడి వాహనాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అల్లరి మూకను చెదరగొట్టేందుకు పోలీసులు నిరసనకారులపై లాఠీఛార్జ్‌ చేశారు. టియర్‌గ్యాస్‌, షెల్స్‌ను ప్రయోగించారు.ఈ ఘటనలో 12 మంది పోలీసులు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 46 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనతో నగరం అంతటా 144 సెక్షన్‌ విధించారు. దాడికి పాల్పడిన వారిపై ఆరు కేసులు నమోదయ్యాయి. హింసాత్మక సంఘటనపై దర్యాప్తు చేపట్టామని పోలీసు కమిషనర్‌ లాభూరామ్‌ తెలిపారు. ఇది వ్యవస్థీకృత దాడి అని కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్‌ఆర్‌ బొమ్మై పేర్కొన్నారు. దాడి ముందస్తు ప్రణాళిక అయివుండొచ్చని హోంమంత్రి జ్ఞానేంద్ర ఆరోపించారు. రెచ్చగొట్టే పోస్టు చేసిన వ్యక్తిని అరెస్టు చేసిన తర్వాతకూడా, వెయ్యిమంది ఠాణాను చుట్టుముట్టారంటే ఇది కచ్చితంగా ప్రేరేపిత ముందస్తు ప్రణాళికగా అనుమానించాల్సి ఉందన్నారు. రాష్ట్రాన్ని కేరళ, బెంగాల్‌ మాదిరిగా మార్చుతామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement