Monday, April 29, 2024

suspends: లోక్ స‌భ‌లో దాడి.. మోడీ స‌మీక్ష‌..8మంది భ‌ద్ర‌తా సిబ్బంది సస్పెండ్

న్యూఢిల్లీ – దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటు లో బుధవారం చెలరేగిన అలజడి పెను సంచలనం సృష్టించిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం కీలక మంత్రులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, మంత్రులు ప్రహ్లాద్‌ జోషీ, అనురాగ్‌ ఠాకూర్‌, పీయూష్‌ గోయల్‌ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా సమావేశానికి హాజరయ్యారు. ఈ స‌మావేశంలో పార్ల‌మెంట్ భ‌ద్ర‌త‌పై ప‌లునిర్ణ‌యాలు తీసుకున్నారు.

ఎనిమిది మంది సిబ్బందిపై వేటు..
మరోవైపు భద్రతా వైఫల్యంపై లోక్‌సభ సెక్రటేరియట్‌ చర్యలు చేపట్టింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఎనిమిది మంది భద్రతా సిబ్బందిని సస్పెండ్‌ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన..
లోక్‌సభలో బుధవారం చోటుచేసుకున్న ఘటనపై పార్లమెంట్‌ ఉభయ సభల్లో విపక్షాలు గురువారం ఆందోళన చేపట్టాయి. ఈ ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే భద్రతా వైఫల్యంపై చర్చ చేపట్టాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. వారి ఆందోళనల మధ్య సభ కొంతసేపు సాగింది. అయితే, విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేయడంతో స్పీకర్‌ వారిని వారించారు. అయినప్పటికీ వారు వెనక్కి తగ్గకపోవడంతో సభ మధ్యాహ్నం కు వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. భద్రతా వైఫల్యంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో ఛైర్మన్‌ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.
బూట్లను కూడా స్కాన్‌..
తాజా ఘటన నేపథ్యంలో పార్లమెంట్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పార్లమెంట్‌ భవనంలోకి ప్రవేశాలపై ఆంక్షలు విధించారు. ఎంపీలు ప్రవేశించే ‘మకర ద్వారం’ నుంచి ఇతరులు వెళ్లకుండా నిషేధం విధించారు. మీడియాపైనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ముందస్తు భద్రతా తనిఖీలు నిర్వహించి మీడియా వ్యక్తులకు పాసులు జారీ చేస్తున్నారు. వారిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. ఇక, పార్లమెంట్‌కు వచ్చిన ప్రతి ఒక్కరి బూట్లను కూడా నేడు స్కాన్‌ చేస్తున్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు ఈ నిషేధాజ్ఞలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement