Sunday, April 28, 2024

AP – వివేకా మర్డర్​ కేసులో విచారణ – సీబీఐ కోర్టులో ఎంపీ అవినాష్​

అప్రూవర్​ దస్తగిరితో పాటు హాజరు
జ్యుడీషియల్​ రిమాండ్​లో మరో అయిదుగురు
కోర్టు ముందు హాజరుపరిచిన పోలీసులు
ఎ5 నిందితుడు శివశంకర్​రెడ్డికి బెయిల్​
మీడియాను నియంత్రించేలా ఆదేశాలు ఇవ్వాలని రిక్వెస్ట్​
అలా కుదరదన్న న్యాయస్థానం
కేసు తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా

మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కేసుపై నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి , అప్రూవర్‌గా మారిన దస్తగిరి హాజరయ్యారు. జ్యూడిషల్ రిమాండ్‌లో ఉన్న ఎర్ర గంగిరెడ్డి , భాస్కర్ రెడ్డి , ఉదయ్ కుమార్, సునీల్ యాదవ్, శివశంకర్ రెడ్డిని పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచారు. సోమవారం ఏ 5 నిందితుడిగా ఉన్న దేవి రెడ్డి శివశంకర్ రెడ్డికి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. మంగళవారం మధ్యాహ్నం తర్వాత చంచల్ గూడ జైలు నుంచి శివశంకర్ రెడ్డి విడుదల కానున్నారు.

మీడియాలో వార్తలు.. యూట్యూబ్​ లింక్స్​ తొలగించాలి..

కాగా.. నాంపల్లి సీబీఐ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఏ6 గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, ఏ7 భాస్కర్ రెడ్డి తరుపున న్యాయవాది వాదనలు వినిపించారు. వివేకా హత్య కేసుపై మీడియా ట్రయల్ జరగనుందని తెలిపారు. యూట్యూబ్ లింక్స్‌ను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని భాస్కర్ రెడ్డి తరుపు న్యాయవాది కోరారు. న్యాయస్థానం కంటే ముందే మీడియా ట్రయల్ చేసి చెబుతోందన్నారు. దీని వలన కోర్ట్ ప్రభావితం అయ్యే అవకాశం ఉందని భాస్కర్ రెడ్డి తరుపు న్యాయవాది తెలిపారు. మీడియాకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సీబీఐ కోర్ట్ తెలిపింది. మీడియా కథనాలతో ఎందుకు కోర్ట్ ప్రభావితమవుతుందని న్యాయస్థానం ప్రశ్నించింది. మేము అప్రమత్తంగానే ఉన్నామని.. కోర్టును ఎవరూ ప్రభావితం చేయలేరని.. అనుమానం అవసరం లేదని న్యాయస్థానం తెలిపింది. తదుపరి విచారణ 28 కి కోర్టు వాయిదా వేసింది.

జ‌గ‌న్ నుంచి ప్రాణ హాని ఉంది – ద‌స్త‌గిరి

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్ గా దస్తగిరి సీబీఐ కోర్టులో తాజాగా ప్రొటక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. తన కుటుంబానికి ఏపీ సీఎం జగన్, ఆయన సతీమణి భారతి, అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఆయన కుమారుడు చైతన్య రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించేలా ఆదేశించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. విట్ నెస్ ప్రొటెక్షన్ స్కీం కింద.. కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని కోరారు మరోవైపు, ఎంపీ అవినాష్ బెయిల్ రద్దు చేయాలని కూడా దస్తగిరి హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా, ఈ కేసులో ఏ5 నిందితునిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదల కానున్నారు.

- Advertisement -

పులివెందుల నుంచి పోటీ

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పులివెందుల నుంచి పోటీ చేస్తానని.. సీఎం జగన్‌ను ఢీకొడతానని దస్తగిరి సవాల్ చేశారు. ఆయన, వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారి బెయిల్ పై విడుదలయ్యారు. మరోవైపు, కోడికత్తి కేసు నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు అలియాస్ కోడి కత్తి శ్రీను వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. రానున్న ఎన్నికల్లో అమలాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. విజయవాడలోని జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరారు. పేదవాడి కోసం రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏ ఒక్క కులం, మతం కోసమో తాను రాజకీయాల్లోకి రావడం లేదని, చట్టసభల్లో అడుగుపెట్టాలన్నారు. పేదవాళ్ల సమస్యల కోసం పోరాడాలని నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement