ఏడుకొండల వెంకటేశ్వరుడి పూజలో అన్నీ విశేషమయినవే..అన్నీ ప్రత్యేకమయినవే..పునుగుపిల్లి తైలం నుంచి ఆయన జరిపే అభిషేకం వరకు వేటి ప్రత్యేకత వాటిదనే చెప్పాలి. అయితే స్వామివారికి చేసే అబిషేకంలో తేనెను విరి విగా ఉపయోగిస్తుంటారు. అయితే ఇప్పటి వరకు వాడిన తేనె కాకుండా ఏపీ గిరిజన సహకార సంస్థ జీసీసీ నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించింది టిటిడి. కాగా ఈ ప్రతిపాదనకు టిటిడి బోర్డు కూడా ఆమోదం తెలిపింది. ఈ తేనెని కొనుగోలు చేసే ముందు గిరిజన సహకార సంస్థ తేనెను టీటీడీ ల్యాబ్ లలో పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు టిటిడి అధికారులు.
కాగా ఎంతమొత్తంలో తేనె కావాల్సి ఉంటుందన్న దానిపై ఇంకా తమకు ఆర్డర్లు అందలేదని గిరిజన సహకార సంస్థ జనరల్ మేనేజర్ చినబాబు తెలిపారు. తేనెతో పాటు శ్రీవారి కైంకర్యాల్లో ఉపయోగించే జీడిపప్పు, పసుపును కూడా గిరిజన సహకార సంస్థ నుంచి కొనుగోలు చేయాల్సిందిగా టీటీడీకి ప్రతిపాదించామని చినబాబు వివరించారు. గిరిజనుల నుంచి తేనె తదితర అటవీ ఉత్పత్తులను జీసీసీ శుద్ధి చేసి విక్రయిస్తుంది. ప్రాసెస్ చేసిన తేనె జీసీసీ విక్రయ కేంద్రాల్లో కిలో రూ.298.77 ధర పలుకుతోంది. బయటి ధరలతో పొల్చితే ఇది తక్కువనే చెప్పాలి. టిటిడి చేపట్టిన ఈ ప్రతిపాదనతో గిరిజనులకు మంచి గిరాకి గిట్టుబాటు కలగనుందన్నమాట.