Monday, April 29, 2024

అముల్‌ నందిని మార్కెట్‌ వార్‌.. రెండు కంపెనీల మధ్య ధరల పోటీ

కర్నాటకలో వేసవిలో పాల యుద్ధం ముదరుతోంది. గుజరాత్‌కు చెందిన అముల్‌, కర్నాటకు చెందిన నందినీ పాల బ్రాండ్స్‌ మార్కెట్‌ వాటా కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (జీసీఎంఎంఎఫ్‌) అముల్‌ పేరుతో పాలు, పాల ఉత్పత్తులను దేశవ్యాప్తంగా విక్రయిస్తోంది. కర్నాటక కో-ఆపరేటివ్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ ఫెడరేషన్‌ (కేఎంఎఫ్‌) నందిని బ్రాండ్‌ పేరుతో పాలు, పాల ఉత్పత్తులను విక్రయిస్తోంది. నందిని పాలు ప్రధానంగా కర్నాటక, ఏపీ, తెలంగాణ, న్యూఢిల్లిd, చెన్నయ్‌ వంటి కొన్ని మార్కెట్లలో బిజినెస్‌ చేస్తోంది. కేఎంఎఫ్‌ ప్రభుత్వ రంగంలోని సహాకార సంస్థ.
బెంగళూర్‌ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నట్లు అముల్‌ ప్రకటించడంతో ఈ రెండు కంపెనీల నేరుగానే తలపడుతున్నాయి. ఇంతకు ముందే కర్నాటలోని కొన్ని ప్రాంతాల్లో అముల్‌ పాలు విక్రయిస్తోంది.

అముల్‌, నందిని రెండు బ్రాండ్లకు మంచి పేరుంది. వేరువేరు రాష్ట్రాల్లో రెండు బ్రాండ్లకు గ్రామీణ ప్రాంతాల్లో పట్టుంది. లక్షల సంఖ్యలో కస్టమర్లు ఉన్నారు. అముల్‌ 1940లో ప్రారంభమైతే, నందిని 1950లో ప్రారంభ మైంది. అముల్‌ పాలు, పాల ఉత్పత్తుల విక్రయంలో దేశంలోనే అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఉంది. కర్నాటకలో నందినికి మోజార్టీ మార్కెట్‌ వాటా ఉంది. బెంగళూర్‌లోనూ మార్కెట్‌ వాటాలో నందినినే అగ్రస్థానంలో ఉంది. హెరిటేజ్‌ వంటి కొన్ని ప్రైవేట్‌ డైరీలు ఉన్నప్పటికీ నందిని మార్కెట్‌ను ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోయాయి. తాజాగా అముల్‌ తాము బెంగళూర్‌ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించడంతో ప్రకంపనలు ప్రారంభమయ్యాయి.

ధరల్లో తేడాలు…

సాధారణంగా అముల్‌ ఒక మార్కెట్‌లో ప్రవేశించే ముందు అప్పటికే మార్కెట్‌లో ఉన్న పాల కంపెనీల ధరల కంటే తక్కువ కు ఇస్తున్నట్లు భారీగా ప్రకటనలు జారీ చేస్తుంది. మార్కెట్‌లో కుదురుకున్న తరువాత అన్ని కంపెనీల మాదిరిగానే రేట్లు పెంచుకుంటూ వస్తుంది. తెలంగాణలోనూ అముల్‌ అదే వ్యూహాన్ని అనుసరించింది. మిగిలిన కంపెలతో పోల్చుతూ ధరలను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తుంది. ఇప్పుడు కర్నాటక మార్కెట్‌లోనూ ఇదే జరుగుతుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం అముల్‌ 1 లీటర్‌ టోన్డ్‌ పాల ప్యాకేట్‌ను 54 రూపాయలకు విక్రయిస్తోంది. అవే పాలను నందిని 11 రూపాయలకు తక్కువకు 43 రూపాయలకు అందిస్తోంది. ఫుల్‌ క్రీమ్‌ పాలు గోల్డ్‌ పేరుతో అముల్‌ లీటర్‌కు 66 రూపాయలకు విక్రయిస్తోంది.

- Advertisement -

అవే ఫుల్‌ క్రీమ్‌ పాలను నందిని 55 రూపాయలకు అందిస్తోంది. పెరుగు లీటర్‌ ప్యాకేట్‌ అముల్‌ 75 రూపాయలకు విక్రయిస్తోంది. నందిని 47 రూపాలకు విక్రయిస్తోంది. వీటితో పాటు రెండు డైరీలు వెన్న, నెయ్యి, ఛాకోలెట్స్‌, ఐసీ క్రీమ్స్‌ వంటి వాటిని విక్రయిస్తున్నాయి. మార్కెట్‌ పరంగా చూస్తే మొత్తం దేశంలో అముల్‌ ఆదిపత్యం కలిగి ఉంది. నందిని కర్నాటలో అత్యధిక మార్కెట్‌ వాటా కలిగి ఉంది. కర్నాటకలో మార్కెట్‌ పెంచుకునేందుకు అముల్‌ ధరల యుద్ధానికి దిగితే నందిని తట్టుకోవడం కష్టమని మార్కెట్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నందిని వార్షిక టర్నోవర్‌ 19,784 కోట్లు ఉంటే, అముల్‌ టర్నోవర్‌ 55 వేల కోట్లుగా ఉంది. నందిని రోజుకు 10 లక్షల లీటర్ల పాలను హ్యాండిల్‌ చేస్తుంటే, అముల్‌ రోజుకు 50.2 లక్షల లీటర్ల పాలను హ్యాండిల్‌ చేస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నందున అముల్‌ కంటే తక్కువ ధరకే వినియోగదారులకు నందిని పాలు, పాల ఉత్పత్తులను అందించగలుగుతోంది. కర్నాటక ప్ర భుత్వం రైతులకు లీటర్‌కు 6 రూపాయల ఇన్సెంటివ్‌ ఇస్తోంది. త్వరలోనే అముల్‌ పాలు కర్నాటకలోని అన్ని ప్రాంతాల్లో రైతులు మేలు చేసేందుకు విక్రయాలు ప్రారంభిస్తుందని ఇటీవల కర్నాటకలో పర్యటించిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన ప్రకటనలో ఇది రాజకీయ రంగు పులుముకుంది. ప్రభుత్వం నందిని పాలను దెబ్బకొట్టి అముల్‌కు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందన్న విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. చివరకు బెంగళూర్‌లో హోటల్స్‌ యాజమానుల సంఘం తాను కేవలం నందిని పాలనే వినియోగిస్తామని తీర్మానం కూడా చేశారు. ప్రభుత్వ రంగంలో విజయవంతంగా నడుస్తున్న నందినిని దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతున్నది ని, అముల్‌కు కర్నాటక మార్కెట్‌ను అప్పటించేందుకు ప్ర్‌యత్నాలు జరుగుతున్నాయని రాజకీయంగా దుమారం చెలరేగింది. రాజకీయ రగడ చెలరేగడంతో అముల్‌ తన ప్రణాళికలను వాయిదా వేసుకోవచ్చన్న వార్తలు వస్తున్నాయి. ఎన్నికల తరువాతే బెంగళూర్‌ మార్కెట్‌లో ప్రవేశించాలని అముల్‌ భావిస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే అముల్‌ మాత్రం దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement