Thursday, May 2, 2024

Delhi | విశాఖలో రూ.234 కోట్లతో అమృత్ మిషన్ ప్రాజెక్టులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విశాఖలో కేంద్ర ప్రభుత్వం అమృత్ మిషన్ కింద రూ. 234 కోట్లతో మంజూరు చేసిన 8 ప్రాజెక్ట్‌లలో కొన్ని పూర్తికాగా మిగిలిన ప్రాజెక్ట్‌ పనులు పురోగతిలో ఉన్నాయని పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ పేర్కొన్నారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమృత్ మిషన్ కింద ఎంపిక చేసిన నగరాల్లో విశాఖపట్నం ఒకటని అన్నారు. అందులో భాగంగా గ్రౌండింగ్ అయిన మొత్తం ప్రాజెక్టులకుగాను రూ.73.31 కోట్లతో చేపట్టిన 4 ప్రాజెక్టులు పూర్తయ్యాయి.

మిగిలిన ప్రాజక్టులు నిర్మాణ దశలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అలాగే రూ. 217 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన మరికొన్ని పనులు భౌతికంగా పూర్తయినట్లు చెప్పారు. విశాఖ నగరంలో తాగునీటి సరఫరాకు సంబంధించి రూ. 70.44 కోట్లతో చేపట్టిన రెండు ప్రాజెక్టులు, రూ. 2.87 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన రెండు పార్కుల నిర్మాణం పూర్తయినట్లు మంత్రి తెలిపారు.

అమృత్ మిషన్ ప్రాధమికంగా 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు 5 ఏళ్ళ కాలవ్యవధితో పూర్తిచేయాలన్న లక్ష్యంతో ప్రాణాళికను సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేపట్టిన కొన్ని ప్రాజెక్టులు భూ వివాదాలల్లో చిక్కుకున్నాయి. దీనికితోడు ప్రకృతి వైపరీత్యాలు, ఇతర శాఖల నుంచి అనుమతులు పొందడంలో జరిగిన జాప్యం, కోవిడ్-19 లాక్‌డౌన్‌ వంటి పలు కారణాల వలన ప్రాజెక్టుల నిర్మాణం అలస్యమైనట్లు మంత్రి తెలిపారు. 2024 మార్చి నాటికి అమృత్‌ మిషన్‌ కింద విశాఖపట్నంలో చేపట్టిన అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయని భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement