Friday, April 26, 2024

Big story | పెట్టుబడులకు స్వర్గధామం.. ఎనిమిదేళ్లలో 2.50లక్షల కోట్ల ఇన్వెస్ట్​మెంట్​

ఆంధ్రప్రభ, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రం అవలంభిస్తున్న ఇండస్ట్రీయల్‌ ఫ్రెండ్లీ విధానాలతో పెట్టుబడులకు స్వర్ధామంగా మారింది. 2022 మే నాటికి టిఎస్‌ఐపాస్‌ కింద వచ్చిన పెట్టుబడి రూ.2,50,966 కోట్లుగా నమోదు కావడం గమనార్హం. ఇక టిఎస్‌ఐపాస్‌ ద్వారా 19649 పారిశ్రామిక యూనిట్ల స్థాపనతో 17,20,780 మందికి ఉపాధి ఊతం అందించి దేశంలోనే ఎవరికీ అందనంత ఎత్తుకు తెలంగాణ పారిశ్రామిక రంగం ఎదిగింది. ఈ ఏడాది పెట్టుబడుల వరద పారి ఏకంగా రూ. 45,190కోట్ల నిధులు జాతీయ, అంతర్జాతీయ సంస్థల పెట్టుబడితో రికార్డు సృష్టించింది. గడచిన ఎనిమిదేళ్లలో ఇలా ప్రగతి సాకారం చేసుకున్న తెలంగాణ పారిశ్రామిక రంగానికి ఉపాధి అవకాశాలు విస్తృతం చేసి అవినీతిరహిత పారిశ్రామిక అనుమతులకు తీసుకొచ్చిన టీఎస్‌ఐపాస్‌ విధానమే కారణమని, సీఎం కేసీఆర్‌ ఈ విధానాన్ని అమలు చేయడంలో తీసుకున్న ప్రత్యేక శ్రద్ధే విజయ శిఖరాలకు చేరేందుకు దోహదపడిందని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి.

సులభతర అనుమతులు, మౌలిక వసతుల కల్పన, భూముల అందజేతరాయితీలు, ప్రోత్సాహకాలతో ప్రభుత్వం పరిశ్రమల యాజమాన్యాలకు అండగా నిల్చింది. కోహోర్ట్‌ స్టార్టప్‌ల ద్వారా 1.19 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల నిధులను ప్రభుత్వం సమీకరించుకున్నది. 2014-20 మధ్య హైదరాబాద్‌లో వెంచర్‌ క్యాపిటలిస్టుల పెట్టుబడి రూ.4.9 బిలియన్‌ డాలర్లుగా నమోదు చేసుకున్నది. దేశంలో అతిపెద్ద ఇంక్యుబేటర్‌ సెంటర్‌ టి హబ్‌ 2 కి రూ.276 కోట్లు ఖర్చు చేసింది. పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం తీసుకొచ్చిన టీఎస్‌ఐపాస్‌ చట్టం అద్భుత ఫలితాలు ఇస్తోంది. సులభతర అనుమతులతో దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు హైదరాబాద్‌కు, తెలంగాణకు పరుగులు పెట్టడానికి ఈ విధానం ఎంతగానో దోహదపడింది.

- Advertisement -

ఇక్కడి వనరులను సద్వినియోగం చేసుకునే దిశగా 14 రంగాలను ప్రాధాన్యంగా ఎంచుకొని పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. ఒకసారి పెట్టుబడులు పెట్టిన కంపెనీలు తెలంగాణలో అనుసరిస్తున్న విధానాలకు ఆకర్షితులై తదుపరి ప్రాజెక్టులు, ప్రతిపాదనలకు కూడా రాష్ట్రాన్ని ఎంచుకుంటున్నాయి. ఐటీ రంగానికి తెలంగాణ రాష్ట్రం, ప్రత్యేకించి హైదరాబాద్‌ను ఉత్తమ గమ్యస్థానంగా మార్చే ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతున్నాయి. ఎనిమిదేళ్లలో రాష్ట్ర ఐటీ ఎగుమతులు రెట్టింపయ్యాయి. మౌలిక సదుపాయల కల్పనకు.. రహదారులు, మంచినీరు, ఇళ్లు తదితర మౌలిక సదుపాయల కల్పనకు కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.

సంక్షేమంలో అగ్రగణ్యం…

ఆరు దశాబ్దాల పోరాటం, ఎందరో త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ ఎనిమిది వసంతాలను పూర్తి చేసుకుంది. దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పాటైన నవ తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా పయనిస్తూ తొమ్మిదో సంవత్సరంలోకి అడుగు పెట్టింది. సంక్షేమ కార్యక్రమాలు… తెలంగాణలో ఆకలిచావులు ఉండకూడదని, కనీస జీవనభద్రత కల్పించాలన్న సీఎం కేసీఆర్‌ సంకల్పానికి అనుగుణంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో అమలు చేయని విధంగా ప్రతి ఏటా రూ. 45 వేల కోట్లతో వివిధ రకాల ప్రజా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, మహిళలు, శిశుసంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది.దీంతో పేదలకు కనీస జీవనభద్రత ఏర్పడింది. అతి తక్కువ సమయంలోనే రాష్ట్రం సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సాధించింది. వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం… రైతుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాలు అమలు చేస్తోంది. రైతుల మేలు కోసం సీఎం కేసీఆర్‌ స్వల్ప, మధ్య, ధీర్ఘకాలిక లక్ష్యాలతో అమలు చేస్తున్న వ్యూహాలు అద్భుత ఫలితాలను ఇస్తున్నారు. పంట కోసం దుక్కి మొదలు పంట అమ్ముకునే దశ వరకు రైతులకు సర్కార్‌ పూర్తి అండగా ఉంటోంది.

వ్యవసాయం అనుబంధ రంగాలు, వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట, 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్‌, రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం, రైతుబీమా సహా ఎన్నో వినూత్న కార్యక్రమాలు అమలవుతున్నాయి. ప్రభుత్వ చర్యల ఫలితంగా రాష్ట్రంలో సాగువిస్తీర్ణం, పంటల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. గొర్రెలు, చేపల పెంపకాన్ని పెద్దఎత్తున ప్రోత్సహిస్తోంది. కోటి పాతిక లక్షల ఎకరాల మాగాణి లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం మొదలు ఇప్పటి వరకు సాగునీటి రంగం పై రూ.లక్షా 59 వేల కోట్లు ఖర్చు చేసింది. కొత్తగా 20 లక్షల ఎకరాలకు పైగా కొత్త ఆయకట్టుతో పాటు మరో 31 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 72.5 లక్షల ఎకరాలను సాగునీరు అందుతుండగా రానున్న రెండు, మూడేళ్లలో మిగిలిన 52.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి వసతి కలుగుతుందని తెలిపింది. ప్రాజెక్టులు, మిషన్‌ కాకతీయ కారణంగా రాష్ట్రంలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి.

విద్యుత్‌ వెలుగులు…

విద్యుత్‌ రంగంలో విజయాన్ని సాకారం చేసుకున్నది. సంక్షోభం నుంచి గట్టెక్కి కోతలు లేని విద్యుత్‌ నిరంతరాయంగా సరఫరా చేస్తున్నారు. 13 వేల మెగావాట్లకు పైగా డిమాండ్‌ వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేసే పరిస్థితి ఏర్పడింది. మిగులు విద్యుత్‌ రాష్ట్రం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. విద్యార్థులకు మంచివిద్య అందించేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. ఆదర్శ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాభోదన ప్రారంభించింది. విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యా#హ్న భోజనం పెడుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి… నాణ్యమైన విద్య, వసతి ఇస్తున్నారు. గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు డిమాండ్‌ బాగా ఉండడంతో పాటు ఆ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. స్థానిక సంస్థలు…స్థానిక సంస్థలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ అవసరమైన నిధులు కూడా కేటాయిస్తున్నారు.

పట్టణ, గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలకు బడ్జెట్‌లోనే నేరుగా నిధులు కేటాయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా చేపట్టిన పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన సర్కార్‌… విశ్వనగరంగా మార్చే ప్రణాళికలను అమలు చేస్తోంది. పెద్దఎత్తున పాలనా సంస్కరణలు చేపట్టి జిల్లాలు, డివిజన్లు, మండలాలు, పంచాయతీల సంఖ్యను భారీగా పెంచింది. తద్వారా ప్రజలకు సేవలు సులువుగా అందే వెసులుబాటు కలిగింది.

ప్రజారోగ్యంపై దృష్టి…

ప్రజారోగ్యంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించడం కోసంసీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపర్చడంతో పాటు సిబ్బంది నియామకం కోసం చర్యలు చేపట్టింది. సర్కార్‌ అమలు చేస్తున్న కేసీఆర్‌ కిట్‌ లాంటి కార్యక్రమాలతో ప్రభుత్వాసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరిగింది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు కేవలం నాలుగు ప్రభుత్వ వైద్యకళాశాలలు ఉండగా… ఇప్పటికే ఐదు కళాశాలలను ప్రారంభించిన ప్రభుత్వం ఇటీవలే మరో ఏడింటిని మంజూరు చేసింది. వాటికి అనుబంధంగా నర్సింగ్‌ కళాశాలలను కూడా మంజూరు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement