Friday, May 10, 2024

27 ఢిల్లీకి సీఎం జగన్.. నీతి ఆయోగ్ భేటీకి హాజ‌రు

అమరావతి, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈసారి ఆయన ఢిల్లి పర్యటన ఒక ప్రత్యేకతను సంతరించుకోబోతోంది. కర్నాటకలో కాంగ్రెస్‌ గెలుపు అనంతరం ఆయన బీజేపీ పెద్దలతో సమావేశం కాబోతున్నారు. మరో ఏడాది కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలు సహా తొమ్మిది రాష్ట్రాలకు ఒకేసారి అసెంబ్లి, పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈక్రమంలో ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటి నుండే గెలుపొటములపై లెక్కలేసుకుంటోంది. ఈక్రమంలోనే దేశ రాజధాని వేదికగా ఈ ఈనెల 27న జరగబోయే నీతి ఆయోగ్‌ కీలక సమావేశానికి సీఎం జగన్‌ హాజరు కానున్నారు.

ఈ సంరద్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్లపై మరోసారి గళమెత్తనున్నారు. రాష్ట్రం ఎదుర్కొంటోన్న విభజన సమస్యలను కేంద్ర ప్రభుత్వానికి వినిపించనున్నారు. ప్రత్యేక హోదా, పోలవరంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వివరించనున్నారు. ఇప్పటికే ఢిల్లి పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమైన సీఎం జగన్‌ నీతి ఆయోగ్‌ సమావేశం అనంతరం ప్రధాని మోడీ, హోం శాఖా మంత్రి అమిత్‌ షాలతో ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరుతూ సీఎంవో వర్గాలు పీఎంవోకు సమాచారం అందిచినట్లు తెలుస్తోంది. అదే క్రమంలో అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌కు కూడా సీఎంవో వర్గాలు ఆయన పేషీకి సమాచారం అందించినట్లు తెలస్తోంది.

27న నీతి ఆయోగ్‌ సమావేశం..

- Advertisement -

ఈనెల 27వ తేదీన నీతి ఆయోగ్‌ బృందం ఢిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో సమావేశం కానుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు లేదా ఆర్థికశాఖ మంత్రులు పాల్గొనున్నారు. ఇందుకోసం సీఎం జగన్‌ ఈనెల 26వ తేదీ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. అదే రోజు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను కలుసుకునే అవకాశం ఉంది. మరుసటి రోజు విజ్ఞాన్‌ భవన్‌లో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొంటారు.

ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలు చేయడంపై ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. అలాగే విభజన సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌, నిధులు విధుల విభజన, ప్రత్యేక హోదా గురించి మాట్లాడనున్నారు. పునర్విభజన చట్టంలోని షెడ్యూల్‌ 9లో పొందుపరిచిన 91 సంస్థల ఏర్పాటు, షెడ్యూల్‌ 10 కింద చేర్చిన 142 ఇతర సంస్థల విభజన అంశాన్ని ప్రస్తావించనున్నారు.

అదే రోజు ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరే అవకాశం

అదే రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మోదీ అపాయింట్‌మెంట్‌ కోసం ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నీతి ఆయోగ్‌ ముగిసిన తరువాత సీఎం జగన్‌ ప్రధానితో భేటీ అయ్యేలా షెడ్యూల్‌ను రూపొందిస్తోన్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ భేటీలో పాల్గొననున్నారు. 27వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నట్లు ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తెలిపారు.

పరిష్కారానికి నోచుకోని విభజనాంశాలు..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయిన ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలో పునర్విభజన చట్టంలో పొందుపరిచిన మెజారిటీ అంశాలు పరిష్కారానికి నోచుకోవట్లేదు. ఎక్కడి ఆస్తులు అక్కడే ఉన్నాయి. వాటి విలువ సుమారు లక్షన్నర కోట్ల రూపాయలు. ఈ విభజన సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దగా ఆసక్తి చూపట్లేదు. ఈ చర్యలను వేగవంతం చేసేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటీ-షన్లు కూడా దాఖలయ్యాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ లోక్‌సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌ కుమార్‌, తెలంగాణ వికాస కేంద్ర సహా మరి కొందరు ఈ పిటీ-షన్లను దాఖలు చేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం కూడా స్పందించి అఫిడవిట్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఈనెల 27న ఢిల్లిd వేదికగా జరగనున్న నీతి ఆయోగ్‌ సమావేశం కీలకంగా మారింది. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలతో భేటీకి కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement