Saturday, April 27, 2024

దారుణం.. ఒకే అంబులెన్సులో 22 మృతదేహాలు

మహారాష్ట్రలోని బీద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 22 కరోనా మృతదేహాలను అధికారులు ఒకే ఒక్క అంబులెన్సులో కుక్కి పంపించారు. అదేంటని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు తీసిన వారి బంధువుల ఫోన్‌లను పోలీసులు బలవంతంగా లాక్కుని.. కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి చేసిన అనంతరం తిరిగి ఇచ్చారు. కాగా ఈ అంశంపై తీవ్ర విమర్శలు రావడంతో అధికారులు స్పందించారు. అంబజోగైలోని స్వామి రామానందతీర్థ మరాఠ్వాడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుంచి ఈ కరోనా మృతదేహాలను తీసుకెళ్లినట్టు చెప్పారు.

‘మా దగ్గర కేవలం రెండే అంబులెన్సులున్నాయి. మరిన్ని కావాలని అడిగినా ఎవరూ స్పందించలేదు. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలకు అంతిమ సంస్కారాలను నిర్వహించేందుకు పురపాలక శాఖ అధికారులకు మృతదేహాలను అప్పగించడం మా బాధ్యత. వారు చేసిన దానికి మేమెలా బాధ్యులమవుతాం?’ అని స్వామి రామానందతీర్థ మరాఠ్వాడా ఆస్పత్రి డీన్ డాక్టర్ శివాజీ శుక్ర వివరణ ఇచ్చారు. కాగా ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేయాలని అదనపు కలెక్టర్‌ను ఆదేశించినట్టు బీద్ జిల్లా కలెక్టర్ రవీంద్ర జగ్తప్ తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కాగా దేశవ్యాప్తంగా ఇప్పటికే మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు, కరోనా మరణాలు నమోదవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement