Monday, April 29, 2024

Editorial – బియ్యం ధరలను అరికట్టలేరా……

పేదవానికి పట్టెడన్నం దొరికేట్టు చేయడం కోసమే కిలో రెండు రూపాయిలకు బియ్యం పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్టు నలభై ఏళ్ళ క్రితం ఆనాటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు ప్రకటించారు. అప్పట్లో కిలో ధర ముప్పయి రూపాయిలు ఉన్నందుకే ఆయన అలా స్పం దించారు. ఇప్పుడు అంతకు రెట్టింపు పైన ధర పలుకు తోంది. ఇంకా ఎంత పెరుగుతుంతోఎవరూ చెప్పలేక పోతున్నారు. బియ్యం ధరల పెరుగుదలకు కారణం మానవ కల్పితమా? లేక పరిస్థితుల ప్రభావమా? ఎలా గైతేనేం, అంతిమంగా మధ్య తరగతి, పేద వర్గాలకు సరసమైన ధరలకు బియ్యం దొరకడం లేదన్నది యధా ర్థం. కారణం అడిగితే అధిక వర్షాలకు పంట మునిగిపో యిందంటారు. బియ్యం ధరలకు రెక్కలు వచ్చి చాలా రోజులైంది. ఇప్పుడు కేంద్రం కళ్ళు తెరిచి బాస్మతియేతర బియ్యం ధరలను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ చర్య ముందే తీసుకుని ఉంటే బియ్యం ధరలు ఇంతలా పెరిగి ఉండేవి కావని సామాన్యుల ఆవేదన. పాక్షికంగా, పూర్తి గా మరపట్టిన బియ్యానికి ఈ నిషేధం వర్తిస్తుంది. ముందే ఓడల్లోకి బియ్యాన్ని లోడ్‌ చేసి ఉంటే అలాంటి వాటిని అనుమతిస్తామని తెలిపింది.

ఆహార భద్రతా చట్టం కేంద్రం అనుమతించిన దేశాలకు బియ్యం ఎగుమ తులు యథావిధిగా జరుగుతాయని డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. గత ఫిబ్రవరి,మార్చి నెలల్లో కురిసిన అకాల వర్షాల వల్ల దిగుబడులు తగ్గాయనీ, పంట నష్టం జరిగిందని ప్రభుత్వం కారణంగా చెబుతోంది. ఇది నమ్మశక్యం కాని విషయం. ఈ ఏడాది అకాల వర్షాలు పడిన మాట నిజమే. అధిక వర్షాల సమస్య వచ్చి కొద్ది రోజులే అయింది. అంతవరకూ పండిన పంట ఏమైంది? రైతుల వద్ద చౌక ధరకు ధాన్యాన్ని సేకరిస్తున్న మిల్లర్లు, వ్యాపారు లు సిండికేట్లుగా ఏర్పడి బియ్యం ధరను పెంచేస్తున్నా యంటూ వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. వామపక్షాలు ఎప్పుడూ అలాగే, ఆరోపిస్తాయని పాలక పార్టీలు కొట్టే యవచ్చు. కానీ, ఇందులో ఎంతో కొంత నిజం ఉంది. . ఆహార ధాన్యాలను రాష్ట్రాల నుంచి కేంద్రం ముక్కు పిండి మరీ వసూలు చేస్తోంది. తెలంగాణ వంటి రాష్ట్రా ల్లో దిగుబడి, సాగుబడి పెరగడం వల్ల ధాన్యాన్ని కొనాల ని కేంద్రంపై ఆయా రాష్ట్రాలు ఒత్తిడి చేస్తున్నాయి.

ఈ విధంగా సేకరించిన ఆహార ధాన్యాల నిల్వలు ఎక్కడికి పోతున్నాయో ఊహించలేనంత అమాయకులు కారు ప్రజలు. శ్రీలంక, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌వంటి దేశాలకు అనధికారికంగా బియ్యం ఎగుమతులు జరుగుతున్నా యని జనం బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. చైనా తర్వాత అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా మన దేశం ఉంది. ప్రపంచం మొత్తం మీద 40 శాతం వరి మన దేశంలోనే పండుతోంది. వరి సాగు తగ్గడం వల్ల కూడా ధరలు పెరిగాయని చెబుతున్నారు. ధాన్యం దిగుబడి గత ఏడాది సెప్టెంబర్‌ నాటికి 5.6 శాతం ఉత్పత్తి తగ్గి 383.99 లక్షల హెక్టార్లకు చేరుకుంది. అంతకుముందు సంవత్స రం 406.58 లక్షల హెక్టార్లలో వరి సాగు అయింది. బియ్యం ధరల పెరుగుదలకు ఎగుమతులకు అనుకూల వాతావరణం ఏర్పడటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. బంగ్లాదేశ్‌ దిగుమతి సుంకాన్ని 25 నుంచి 15.5 శాతానికి తగ్గించింది.

దీంతో మన దేశంలో బియ్యం ఎగుమతులు ఒక్కసారిగా ఐదు శాతం పెరిగా యి. బియ్యం ధరలతో పాటు గోధుమల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా గోధుమ ధరలు పెరిగాయనిచెబుతున్నారు. ధాన్యం ధరలపై ప్రభుత్వాధికారులకే స్పష్టత లేదు. అధికారికం గానే కాకుండా అనధికారికంగా ధాన్యం పంట వేస్తుంటా రు. ఆ విధంగా వచ్చిన దిగుబడి ఏమైపోతోందో తెలియ దు. మిల్లర్లు, వ్యాపారులు కుమ్మక్కు కావడం వల్లనే ఇలా జరుగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. 25 కిలోల బియ్యం ధర బస్తా ఏటికాయేడు పెరిగిపోతోంది. గత ఏడాది 1,100 రూపాయిలు ఉంటే ఈ ఏడాది 1250 రూపాయిలకు అమ్ముతున్నారు. బియ్యం మార్కెట్లపై ప్రభుత్వానికి అదుపులేదు. చౌకధరల దుకాణాల్లో విక్ర యించాల్సిన బియ్యం బ్లాక్‌ మార్కెట్‌కి తరలి పోతోందని ఆరోపణలు వస్తున్నాయి.

కోటా బియ్యం లారీలను చాలా చోట్ల పట్టుకుంటున్నారు. అయినా, యథేచ్ఛగా అక్రమ రవాణా సాగిపోతోంది. జీఎస్టీ భారంతో బియ్యం వ్యాపారం సక్రమంగా సాగడం లేదని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో బియ్యం వర్తకులు నిల్వ ఉంచుకునే వారనీ, ఇప్పుడు ఎంత లాభం వస్తే అంతకు అమ్మేస్తున్నారని, ఎక్కడా నిల్వ ఉండటం లేదని చెబుతు న్నారు. ప్రభుత్వం అమలుజేస్తున్న పథకాల ప్రయోజనా లు నేరుగా లబ్ధిదారులకు చేరినట్టే, ఆహార ధాన్యాలు కూడా కుటుంబాలవారీగా క్రమం తప్పకుండా చేరేట్టు చర్యలు తీసుకుంటేనే బియ్యం ధరలు అదుపులోకి వస్తాయని సమాజ హితైషులు చెబుతున్నారు. బియ్యం మార్కెటింగ్‌, పంపిణీ వ్యవస్థలను క్షాళన చేయాల్సిన అవసరం ఉందని వారంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement