Monday, May 6, 2024

మాల్యా ఎక్కడున్నారో తెలీదా

విజయ్‌ మాల్య.. కింగ్‌ఫిషర్‌ అధినేతగా ఆయన పేరు అందరికీ పరిచయమే. భారత దేశపు వ్యాపార దిగ్గజాల్లో ఆయన పేరు ఎప్పుడూ ముందుండేది. ఆయన పరపతికి తగినట్టే దేశంలోని ప్రధాన బ్యాంకులు ఆయనకు వేల కోట్ల రూపాయిలు రుణాలిచ్చేవి.. ఇచ్చా యి. గడువులోగా ఆయన తిరిగి చెల్లించకపోయినా స్వదేశంలొనే ఉండి ఉంటే దేశంలో ఉన్న ఇతర ఎగవేత దారుల్లో ఒకనిగా ఉండేవారు. అయితే, బ్యాంకుల రుణాలు ఆరువేల కోట్ల రూపాయిల వరకూ బకాయిలు చెల్లించకుండా ఎనిమిదేళ్ళ క్రితం దేశంలో ప్రభుత్వం మారిన కొత్తలో విదేశాలకు తరలి వెళ్ళి పోయారు. లండన్‌లో ఉన్నట్లు సమాచారం పదేపదే అందుతోంది. అంతే కాదు, లండన్‌ వీధుల్లో ఆయన కారులో షికారుగా వెళ్తున్నట్టు మీడియాలో ఫొటోలు, వీడియో ఫిలింలు రోజూ వెలు వడుతూనే ఉన్నాయి. లండన్‌లో ఆయనేమీ చిరునామా లేకుండా ఉండటం లేదు. కోర్టు వారు పిలిచినప్పుడల్లా హాజరవుతున్నారు. మాంచెస్టర్‌ కోర్టుకు పలుసార్లు హాజరయ్యారు. అలా నడుస్తూ… చిద్విలాసంగా కోర్టుకు హాజరైన దృశ్యాలు యావత్‌ ప్రపంచం చూసింది. అలాంటి ప్రముఖుడు ఎక్కడున్నాడోతమకు తెలియలేదనీ, ఎంత ప్రయత్నించినా ఆయన సమాచారాన్ని కనుగొనలేకపో తున్నామని న్యాయవాది ఈసీ అగర్వాల్‌ సుప్రీంకోర్టుకు విన్నవించారు. అంతేకాదు. ఈ కేసు విచారణనుంచి తనను తప్పించాలని ఆయన మొరపెట్టుకున్నారు. ఆ న్యాయవాది వాదన అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఎంతో పేరున్న సెలబ్రెటీ ఎక్కడున్నాడో తెలియదనడం ఆశ్చర్యమే మరి. ఈ కేసు విచారణలో వస్తున్న ఒత్తిళ్ళను భరించలేక ఆ న్యాయవాది అలా చెప్పారా? లేక పైనుంచి వచ్చిన సలహాల మేరకు అలా చెప్పారా అని మీడియాలో ఒకట తర్జన భర్జన. నిజమే విజయ్‌ మాల్య బ్రాండ్‌ అంత ప్రముఖమైనది. విజయ్‌ మాల్య గురించిన వార్తలు వచ్చిన ప్పుడల్లా ఆయనకు పార్టీలతో ప్రమేయం లేకుండా అన్ని పార్టీల వారితో సత్సంబంధాలున్నాయని సామాన్యులు సైతం చెప్పుకోవడం కద్దు. ఆయనను భారత్‌కి అప్పగించాలని లండన్‌ కోర్టు 2020లోనే ఆదేశించినా, ఇంతవరకూ అమలు కాలేదు.అంటే ఆయనకు బ్రిటన్‌లో కూడా మిత్రులు అనేకమంది ఉన్నారు. రాజకీయ నాయకులే కాకుండా, వ్యాపార వేత్తలు అనేక మంది హితులు.. సన్నిహితులు ఉన్నారు.ఆయన అటు బ్రిటన్‌లోనూ, ఇటు భారత్‌లోనూ రాజకీయ పార్టీలకూ, వాటికి నేతృత్వం వహిస్తున్న వారికీ భూరిగా విరాళాలు ఇవ్వడం వల్లనే ఆయనపై ఈగ వాలకుండా అంతా చూసుకుంటున్నారన్న కథనాలు కోకొల్లలు. అంతేకాక, విజయ్‌ మాల్య చేస్తున్న లిక్కర్‌ వ్యాపారం గుడ్‌విల్‌కి కా సుల వర్షం ఇప్పటికీ కురుస్తోంది. కర్నాటకలో పేరున్న సామాజిక వర్గానికి చెందిన ఆయనకు దక్షిణాదిలోనే కాకుండా, ఉత్తరాదిన సినిమా పరిశ్రమవారితో మంచి సంబంధాలున్నాయి. అందుకే ఆయనపై ఎన్ని ఆరోప ణలు వచ్చినా, మన దేశంలో ఆయనను సీబీఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థలు అరెస్టు చేయడానికి సాహసిం చలేదు.

- Advertisement -

కేంద్ర మంత్రుల స్థాయిలో ఆయనకు పరిచ యాలు, స్నేహాలు ఉన్నాయి. అన్ని స్థాయిల్లో ఆయనకు ఛత్రం పట్టే వారుండటం వల్లనే సునాయాసంగా దేశా న్ని విడిచి వెళ్ళగలిగారు. ఆయనను యూపీఏ ప్రభుత్వం దేశం నుంచి దాటించిందంటూ ఆరోపించిన ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు వేల కోట్ల రూపాయిల బకాయిలు పెట్టిన నీరవ్‌ మోడీ, మెహుల్‌ చోక్సీ వంటి వారు విదేశాలకు పరారు కాగలిగారు. వీరంతా ఒక్కొక్కరుగా దేశం విడిచి వెళ్ళ డంతో విదేశీ బ్యాంకుల్లో మన వారు దాచుకున్న వేలు, లక్షలాది కోట్ల రూపాయిల నల్లధనాన్ని తిరిగి తెప్పిస్తామన్న వాగ్దానాలను ప్రజలు నమ్మడం లేదు. విదేశీ బ్యాంకుల సంగతి ఆ తర్వాత ముందుగా దేశంలోని బ్యాంకులకు టోపీ పెట్టినవారి సంగతి తేల్చండి అంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ధ్వజమెత్తడం ప్రారంభించాయి. బ్యాంకుల ఎగవేతదారుల నుంచి బకాయిలను కక్కిస్తున్నా మనీ, ఇంతవరకూ 16వేల కోట్ల రూపాయిలు పైగా వసూలు చేయగలిగామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్‌ ఇటీవల పార్లమెంటులో ప్రకటించారు. అయితే, విదేశాలకు తరలిపోయిన ఎగవేతదారుల నుంచి వసూలు కావల్సిన బకాయిల సొమ్ము ఇంకా పెద్ద మొత్తంలోనే ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నల్లధనం ఎక్క డున్నా దానిని పెకలించి తెస్తామన్న ప్రభుత్వ వాగ్దానం ఆశించిన స్థాయిలో జరగకపోవడం వల్ల అందరూ అందరే అనే నిశ్చయానికి ప్రతిపక్షాలే కాకుండా ప్రజలు కూడావస్తున్నట్టు కనిపిస్తోంది. ఏటియేడు మేటలు వేస్తున్న నల్లధనం రాశులను తవ్వి తీసుకు రాకుండా ప్రజలపై కొత్తగా సెస్సు, జీఎస్టీ వంటివి వేస్తూ ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తోంది. నల్లధనం వెలికితీతలో రాజకీయ, ప్రాంతీయ అభిమాన దురభిమానాలు లేకుండా ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించి నప్పుడే ప్రజలకు విశ్వాసం కలుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement