Tuesday, April 30, 2024

శ్రీకృష్ణుని సనాతనత్వం

అనుశాసనం అనగా ఉపదేశము ద్వారా మహిమను నిరూపణము చేయుట. భీష్మాచార్యుడు యుధిష్ఠిరునకు అనుశాసనం ద్వారా శ్రీకృష్ణ భగవానుని సనాతనత్వాన్ని వివరించాడు. దుర్భుద్ధి కలిగిన దుర్యోధ నుడు పరలోకానికి పయనమై వెళ్ళిపోయినప్పటికి భీష్ముడు అతని గురించే ఎక్కువ చింతించాడు. అతని వలననే అనంత సైన్యం నాశనమయిపోయింది. దుశ్శాసన, కర్ణ, శకునులు ఆ దుర్యోధనునితో కలవడం వల్ల మరింత నాశనానికి దోహదమయింది. శ్రీకృష్ణ భగవానుడు ధర్మసంస్థాపనకై ఎంత ప్రయత్నించి నా యుద్ధము అనివార్యమైనది. అనేక ధర్మ సూక్ష్మాలతోబాటు పార్వతీ పరమే శ్వరుల సంవాదాన్ని నారద మహర్షి ద్వారా తెలుసుకున్న భీష్ముడు ధర్మరాజుకు తెలియజేశాడు.
నమ: సమస్త భూతనామాది భూతాయ భూభృతే|
అనేక రూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే||
సమస్త ప్రాణుల యొక్క ఆదిభూతుడును, భూమిని భరించువాడును, అనేక రూపములు ధరించువాడు, సర్వసమర్థుడు అయిన విష్ణు భగవానునకు ప్రణామము. ఆయనే శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మకంటే శ్రేష్ఠుడు. ఆయన సనాతనుడైన శ్రీహరి. అతని వక్షస్థలంపై శ్రీవత్స చిహ్నం శోభి ల్లుతూ ఉంటుంది. హృషీకాలకు అనగా ఇంద్రియాలకు అధిపతి కాబట్టి హృషీ కేశుడైనాడు. బ్రహ్మదేవుడు ఉదరం నుండి, ఈశ్వరుడు మస్తకం నుండి ఉద్భవిం చారు. శిరోజముల నుండి నక్షత్రములు, శరీర రోమాల నుండి సమస్త ఋషు లు, సనాతన లోకాలు జనించాయి. ముల్లోకాలకు అధిపతి అయిన శ్రీకృష్ణుడు భూదేవిని సంరక్షిస్తున్నాడు. దేవతలకు ఆయనే రక్షకుడు. ఆయనకు సనాతను డు, నారాయణుడు, మధుసూదనుడు, గోవిందుడు, శ్రీహరి అను అనేక నామా లు ఉన్నాయి. సత్త్వగుణాన్ని, దేవతలను సదా కాపాడుతుండే ఆ వాసుదేవుడు పరబ్రహ్మ స్వరూపుడు. ఆయన దివ్య విశ్వరూప విగ్రహంలో దేవతలందరూ సుఖంగా నివసిస్తున్నారు.
శరాన్గము అను ధనుస్సు, సుదర్శన చక్రం, నందకమను ఖద్గము దివ్య ఆయుధాలుగా కలిగి ఉన్నాయి. ఆయన గరుడ ధ్వజంతో విరాజిల్లుతుంటాడు. ఆయనకు ఉత్తమ శీలం, శమం, దమం, పరాక్రమం, వీర్యం, సుందర రూపం, ఉత్తమ దర్శనం, అద్భుత ఆకృతి, ధైర్యం, సరళత్వం, ఇంకా అనేక సద్గుణాలు ఉన్నాయి. ఆయన వద్ద సిద్ధంగా అనేక అస్త్ర శస్త్రాలు ఉంటాయి. సహస్ర నేత్రు డైన ఆయన యోగాభ్యాస సంపన్నుడు.
శరణుకోరినవారికి వరదాయకుడు. ధర్మజ్ఞుడు, నీతిజ్ఞుడు, బ్రహ్మవాది, జితేంద్రియుడు అయిన ఆ నారాయణున్ని పూజిస్తే పరమ ధర్మం సిద్ధిస్తుంది. మానవుల శ్రేయస్సు కొరకు కోట్ల కొలది ఋషులను సృష్టించాడు. మహావరా హ రూపం ధరించిన సర్వలోక పితామహుడైన ఆ జగదీశ్వరునికి నిత్యం పూజ లు నిర్వహించాలి. శ్రీకృష్ణ భగవానుని అర్చిస్తే త్రిమూర్తులను సేవించినట్లే!
ఏషమే సర్వధర్మాణాం ధర్మోధికతమో మత:|
యద్భక్త్యాపుండరీకాక్షం స్తవైరర్చేన్నర: సదా||
సమస్త మానవులు, జీవులు కమల నేత్రుడగు వాసుదేవుని భక్తిపూర్వ కముగా గుణ సంకీర్తన, రూపస్తోత్రములచే సదా అర్చించుటయే సమస్త ధర్మములలో గొప్ప ధర్మమని భీష్ముడు తెలియచేసాడు.
శణాగతులకు శరణునొసగడమే భగవానుని ఉత్తమ వ్రతం. సజ్జనులు కూ డా ఈ వ్రతాన్ని అనుసరిస్తారు. ఆయనకు అనన్య భక్తులైనవారు నిర్భయులై చరిస్తారు. శంకర భగవానుడు కూడా శ్రీకృష్ణుని మహిమను సదా స్మరిస్తాడు. భీష్మాచార్యుని అనుశాసన వాక్యములు, స్తోత్రములు, సహస్రనామాలు విన్న టువంటి పాండవులు, ఋషులు శ్రీకృష్ణ భగవానుని స్తుతిస్తూ, ఆయన దర్శ నాన్ని తరచూ కలిగించవలెనని అర్థించారు. అందరూ ప్రదక్షిణలు చేసారు. ఓ ధర్మరాజా! నీకు సంపూర్ణ విజయం, కీర్తి, అఖండ భూమండల రాజ్యం అన్నీ భగ వానుని ఆశ్రయించినందువలననే లభించాయి. ఆ నారాయణ స్వరూపుడే మీకు రక్షగా నిలిచాడు.
ఈ ధర్మ యజ్ఞంలో నీవు స్వయంగా హోతవై ప్రళయాగ్ని వంటి తేజస్సు కలిగిన శ్రీకృష్ణ భగవానుని స్రువముగా చేసి సమరాగ్నిలో అందరినీ ఆహుతి చేసావు. సకల బంధు పరివార సహితంగా దుర్యోధనుడు శోచనీయుడయ్యా డు. ఆ మూర్ఖుడు అసూయ, క్రోధము, ఆవేశముతో కృష్ణార్జునలతో యుద్ధానికి తలపడి నాశనమయ్యాడు.
ఎవరైతే సత్యమునకు దూరంగా అంటే ధర్మవిరుద్ధంగా ప్రవర్తిస్తారో వారు శ్రీకృష్ణుని చక్రాగ్నికి బలి అవ్వవలసినదే! కావున ఓ! యుధిష్ఠిరా! నీవు ఏవిధంగాను చింతించవలసిన అవసరం లేదు.
శ్రీకృష్ణ భగవానుని మహిమను నేను విన్నది విన్నట్లుగా నీకు తెలియ చేసాను. మహాపురుషుడైన భగవానుని ప్రభావాన్ని విన్నవారికి, స్మరించిన వారికి పరమ శుభం కలుగుతుంది. మోక్షగాములు జనార్దనుని శరణు పొం దాలి. కావున నీవు ఆయననే స్మరిస్తూ సదా ధర్మబద్ధంగా ప్రజాపాలన చేస్తూ వుండు. ప్రజారక్షణ కోసం, ధర్మం కోసం ఉపయోగించే ఉచితమైన దండన మాత్రం మరచిపోకు. శ్రీకృష్ణుడు, అర్జునుడు ప్రతి యుగంలోను ధర్మ సంస్థా పనకై అవతరిస్తూనే ఉంటారు. ఎన్ని ఇబ్బందులకు లోనైననూ తుదకు విజ యం వారినే వరిస్తుంది. ఎందువలన ననగా-
ఉక్త వానస్మి దుర్భుద్ధిం మన్దం దుర్యోధనం తదా|
“యత: కృష్ణస్తతో ధర్మో యతో ధర్మస్తతో జయ:||
నేను దుర్యోధనునితో కూడా అనేకసార్లు చెప్పాను. ఎచట శ్రీకృష్ణుడుం డునో అచట ధర్మముండును. ఎచట ధర్మముండునో అచట జయముండును. యుగయుగాలలోను సురాసుర సంగ్రామము, ధర్మాధర్మ విచక్షణ, చీకటివెలు గులు అనగా సృష్టి, ప్రళయము తప్పవు. కాని చివరకు అవతార పురుషుని వలన ధర్మమే జయిస్తుంది. శిష్టులు, సమస్త జీవకోటి సంరక్షించబడతారు. కావున ఎవరైతే సత్యమైన ధర్మమును ఆశ్రయించి భగవానుని సృష్టి రచనకు అనుగుణంగా నడుచుకుంటారో వారు సదా ఆనంద స్వరూపులై నిలుస్తారు.
ఈవిధంగా భీష్ముడు యుధిష్ఠిరునకు శ్రీకృష్ణ భగవానుని మహిమను తెలియచేసాడు. కృష్ణం వందే జగద్గురుం.

Advertisement

తాజా వార్తలు

Advertisement