Monday, April 29, 2024

వైభవంగా శ్రీయాగం ప్రారంభం

తిరుచానూరు, ప్రభన్యూస్‌: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం నవకుండాత్మక శ్రీయాగం వైభవంగా ప్రారంభమైంది. ప్రపంచ శాంతి, సౌభాగ్యం కోసం శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రార్థిస్తూ ఏడు రోజుల పాటు- జరుగనున్న శ్రీయాగాన్ని కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో అర్చకులు వేంపల్లి శ్రీనివాసన్‌ ఆధ్వర్యంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 9.30 గంటలకు యాగం ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు యాగశా లలో సంకల్పం, హోమాలు, చతుష్టానార్చన, అగ్ని ప్రతిష్ట, నిత్యపూర్ణాహుతి, నివేదన, వేద విన్నపం, మహామంగళహారతి, సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు చతుష్టానార్చన, శ్రీయాగం హోమాలు, లఘుపూర్ణాహుతి, మహానివేదన, వేద విన్నపం, మహా మంగళహారతి చేపట్టి అమ్మవారి ఉత్సవర్లను సన్నిధిలోకి వేంచేపు చేశారు.
50 సంవత్సరాల తర్వాత..
తిరుచానూరు అమ్మవారి ఆలయంలో 50 సంవత్సరాల తర్వాత లోక కల్యాణం కోసం టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు ఈ యాగం నిర్వహిస్తున్నారు. అమ్మవారికి సుబ్బారెడ్డి దంపతులు 34 గ్రాముల బంగారు హారాన్ని కానుకగా ఇచ్చారు. అర్చకులు ఉత్సవమూర్తికి ఈ హారాన్ని అలంకరించారు. టీటీడీ ఛైర్మన్‌ మీడియాతో మాట్లాడుతూ పద్మావతి అమ్మవారి అనుగ్రహంతోనే నవకుండాత్మక శ్రీ యాగం నిర్వహిస్తున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement