Wednesday, May 1, 2024

ధర్మం – మర్మం : దానం (ఆడియోతో…)

మహాభారతంలోని సుభాషితం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

అవ్రతానాం అమంత్రాణాం అజపానాంచ భారత
ప్రతి గ్రహో నదాతవ్య: నశిలా తారయేచ్ఛిలామ్‌

నియమనిష్టలను అనుష్ఠించని వారికి, వేదమంత్రములను అభ్యసించని వారికి, భగవంతుని మంత్రములను జపము చేయనివారికి ఏ వస్తువును దానం చేయరాదు. ఒక శిల ఇంకొక శిలను తరింపచేయలేదు అనగా దానం చేసేవాడు తాను చేసే పాపం నశించి పుణ్యఫలం కలగాలని దానం చేస్తాడు. అంటే తన నుండి దానం తీసుకునే వాడు తన పాపాన్ని పోగొట్టి పుణ్యాన్ని ప్రసాదించాలి కావున అలా దానం తీసుకునేవాడు సత్యమును, ధర్మాచరణను వ్రతముగా నిష్ఠగా అనుసరించే వాడు కావాలి. ఎ లాగైతే స్వచ్ఛమైన నీరు మురికిని పోగొడుతుందో తాను పవిత్రుడు అయితేనే ఎదుటివాని అపవిత్రతను తొలగించగలడు, తానే అపవిత్రంగా ఉన్నపుడు ఎదుటివాని అపవిత్రతను పోగొట్టలేడు. తాము వేదమును అభ్యసించి వేదమంత్రాలకు అర్థాన్ని తెలుసుకొని, తెలుసుకున్న అర్థాలను ఆచరించుట ద్వారా పవిత్రులగదురు. ఇవి వారిని పాపరహితులను చేస్తుంది. ఇక ఆ వేదాలలో చెప్పిన కొన్ని నియమాలను, అనుష్ఠానములను, వ్రతాలను ,భగవన్మంత్రాలను జపం చేయుట వలన విశేషమైన పవి త్రత, తేజస్సు కలుగుతుంది. ఈ పవిత్రతే ఎదుటివారి పాపాలను పోగొడుతుంది. అందుకే శిల ఇంకో శిలను తరింపచేయలేదని అన్నారు. అందుకే వ్రత, తప,మంత్ర, జప పరులకు మాత్రమే దానం చేయాలని భావం.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement