Tuesday, May 21, 2024

MDK: కార్మిక లోకానికి కాంగ్రెస్ అండ..ఎంపీ అభ్యర్థి నీలం మధు..

బీహెచ్ఈఎల్ ఐఎన్టీయూసీ నేతలను కలిసిన ఎంపీ అభ్యర్థి..
సమస్యలను దృష్టికి తీసుకొచ్చిన నేతలు
కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును గెలిపించుకుంటామన్న నేతలు, కార్మికులు..

మెద‌క్ : కార్మికలోకానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు అన్నారు. మే డేను పురస్కరించుకుని బుధవారం బీహెచ్ఈఎల్ ఐఎన్టీయూసీ కార్యాలయానికి విచ్చేసిన నీలం మధుకు యూనియన్ నేతలు, నాయకులు ఘన స్వాగతం పలికి, ఆయన్ను సన్మానించారు. ఈ సందర్భంగా బీహెచ్ఈఎల్ ఐఎన్టీయూసీ అధ్యక్షులు రెహమాన్ ఎంప్లాయిస్, వర్కర్ల సమస్యలు, కార్మికుల కోసం చేపట్టాల్సిన వాటిని గురించి నీలం మధు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో యూనియన్ నేతలు దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎంపీ అభ్యర్థి నీలం మధు తెలిపారు. అలాగే నేతలు ఇచ్చిన సలహాలు, సూచనలను తూచా తప్పకుండా పాటిస్తానని పేర్కొన్నారు. వాస్తవానికి కర్మాగారాలను ఏర్పాటు చేసేది కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. దేశ మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ హయాంలోనే ఈ ప్రాంతంలో బీహెచ్ఈఎల్, బీడీఏల్, ఇక్రిసాట్ తదితర కంపెనీలను నెలకొల్పి ఉపాధి చూపడం జరిగిందని గుర్తు చేశారు. తాను ఎంపీగా గెలిచాక కాంట్రాక్టు కార్మికులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ అధికారంలోకి రావాలి.. ఐఎన్టీయూసీ అధ్యక్షులు రెహమాన్..
గత పదేళ్లుగా బీజేపీ సర్కారు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వస్తుందని ఐఎన్టీయూసీ అధ్యక్షులు రెహమాన్ పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలను కూడా ప్రైవేటు పరం చేసే దిశగా మోడీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తద్వారా ఉద్యోగులతో పాటు కార్మిక లోకానికి తీవ్ర అన్యాయం జరిగే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ సర్కారు విధానాలను తిప్పి కొట్టాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే మెదక్ పార్లమెంటు పరిధిలో వివిధ ఫ్యాక్టరీలు, కంపెనీల్లో ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు సుమారు రెండు లక్షల వరకు ఉన్నారని తెలిపారు. వీరందరి భవిష్యత్తు బాగుండాలంటే కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును ఖ‌చ్చితంగా గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

ప్రధాన కార్యదర్శి స్వామి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ సర్కారు కూడా ఈ రాష్ట్రంలో కార్మికులను పట్టించుకోలేదన్నారు. వారి తరపున గొంతేత్తిన కార్మిక సంఘాలను అణగదొక్కే ప్రయత్నం చేసిందని విమర్శించారు. ఈ పార్లమెంటు ఎన్నికల ద్వారా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీహెచ్ఈఎల్ నాయకులు, దామోదర్ రెడ్డి, స్వామి, వలియుద్దీన్, కొండారెడ్డి, మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement