Saturday, May 11, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం – ముందు మాట

ధూర్జటిమహాకవిసాహితీసమరాంగణ చక్రవర్తి, ఆంధ్రభోజబిరురుదాంకితుడు అయిన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని భువనవిజయసభలో ఉన్న అష్టదిగ్గజాలలో ఒకడని సాహితీవేత్తల అభిప్రాయం. ధూర్జటి పరమ శివభక్తుడు. ఇతర దైవాలని నిందించక పోయినా, వారికి నమస్కారం కూడా చేయడు. భక్తి తీవ్రత ఎంతటిది అంటే కనీసం తన తల్లి తండ్రుల పేర్లు కూడా చెప్పుకోలేదు శ్రీకాళహస్తీశ్వర శతకంలో. శ్రీకృష్ణ దేవరాయలో! శ్రీవైష్ణవుడు. అయి ఉండి కూడా ముదిరినశివభక్తి కల ధూర్జటికి తన ఆస్థానంలోని భువనవిజయ సభలో స్థానం కల్పించాడు. ఇది కృష్ణదేవరాయల సాహిత్యాభిమానానికి సంకేతం. మతవిశ్వాసాలను సాహిత్యం పట్ల ఉన్న అభిమానం అధిగమించింది. పైగా మదాంధులైనరాజులని నిందిస్తూ రచించిన కవిని ఆదరించాడు. ఇది రాజు సహృదయతకిసంకేతం అయితే రాజాదరణ కోసం తన నమ్మకాన్ని పణంగా పెట్టక పోవటం, రాజుల దుష్ప్రవర్తనని నిర్మొహమాటంగా విమర్శించటం ధూర్జటి వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి.
ధూర్జటి శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మ్యంఅనే ప్రబంధం కూడా రచించాడు. కాని శతకంలో భావప్రకటనా స్వేచ్ఛ ఎక్కువ. ఏ పద్యానికి ఆ పద్యమే. పండిన భక్తి మాత్రమే కాదు, సాహితీ విలువలు, సామాజిక స్పృహ నిండుగా దర్శన మిస్తాయి ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో.
తినబోతూ రుచి అడగటం దేనికి? ఆస్వాదించండి.

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం
1. శ్రీ విద్యుత్కలితాజవంజవ మహాజీమూత పాపాంబుధా
రా వేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబు గోల్పోయితిన్
దేవా, నీ కరుణాశరత్సమయ మింతే చాలు, చిద్భావనా
సేవన్ దామరతంపరై మనియెదన్ శ్రీ కాళహస్తీశ్వరా.
తాత్పర్యం: సాలె పురుగును, పామును, ఏనుగను కూడా కాపాడి, వాటికి మోక్షమొసగి, వాటిని నామము నందు కూడా ధరించి, తీర్థమునకు కూడా అదే పేరుంచిన భక్తవత్సలుడైన ఈశ్వరా! శ్రీ కాళహస్తీశ్వరా!
సంపదలు అను మెఱుపుతీగెలు కల సంసారము అను మేఘములు పాపములు అను వర్షధారలు కురియగా, ఆ వానకు నా మనస్సు అను పద్మము కాంతి లేక వాడి పోయింది. ఇప్పుడు నీ దయ అనే శరత్కాలము వచ్చింది. ఇంత మాత్రము చాలు. నీ చిన్మయ రూపమును ధ్యానించుతూ తామరతంపరగ సర్వవిధముల వికాసము కలవాడనై జీవిస్తాను.
విశేషం: ప్రాచీన కావ్యసంప్రదాయము ననుసరించి తన శతకాన్ని ‘శ్రీ’ అనే మంగళశబ్దంతో ప్రారంభించాడు ధూర్జటి. తన శతకంలో శుభప్రదమైన అంశాలే ఉంటాయని, భక్తులకు శుభము, మంగళము అంటే కైవల్యమే కనుక ఆ కైవల్యాన్ని పొందే మార్గానికి ఇది ప్రారంభం అని సూచన ఉంది. ఈ శతక రచనకు ముందు తాను అనుభవించింది, ఈ రచనా సమయంలో అనుభూత మయింది, రచన వల్ల తాను పొందగోరు ప్రయోజనము అయిన కైవల్యము విన్న, చదివిన వారందరకూ మార్గదర్శకమై లక్ష్యమై సిద్ధిస్తుందనే శుభాశంసన ఈ ప్రథమ పద్యంలో ద్యోతక మవుతోంది. తన రచనా ప్రణాళిక అంతా భక్తుడు భగవంతుణ్ణి చేరటానికి చేసే సాధనా మార్గ మంతా తానీ శతకంలో ప్రస్తావించ బోతున్నట్టు వస్తునిర్దేశం చేసినట్లనిపిస్తుంది. తన రచనా ప్రణాళికను కావ్యవస్తుస్వరూపాన్ని వ్యంగ్యంగా భాసింప చేశాడు.
1. శ్రీ విద్యుత్ కలితాజవంజవము యొక్క నీచత,
2. పాపాంబు ధారల వలన మనోజ్ఞము వికాసము కోల్పోయే దుస్థితి,
3. భగవత్కరుణా శరత్సమయ ప్రయోజనము,
4. సేవామాహాత్మ్యము
అనే ఈ నాలుగు ఈ శతకంలో ప్రధానాంశాలు. దీని నుండి ‘ తామర తంపర’ గా పుట్టినవే మిగిలిన పద్యాలు అనే సూచన ఈ పద్యాలలో ఉండి నాటకంలోని నాందీ పద్యం వలె ఉన్నది ఈ తొలి పద్యం.
వర్ష ఋతువులో తామర పూలు వాన తాకిడికి వడలి పోయి ఉండటం, శరత్కాలంలో వికసించటం ప్రకృతి ధర్మం. మనస్సుని పద్మంగా చెప్పటం, చిద్భావన వలన వికాసం తామర తంపరగా అవుతుందనటం – షట్చక్రాలని, వాటి వికాసాన్ని స్ఫురణకి తేవటమే.
శ్రీకాళహస్తి యందు శివుడు జ్ఞానప్రసూనాంబికాపతి. స్వయంగా జ్ఞానస్వరూపుడు కూడ. కనుక అచటి ఈశ్వరుడిది ‘చిత్’ స్వరూపమే.
అలంకారాలు:
శ్రీకి విద్యుత్ కి ఆజవంజానికి మహాజీమూతానికి, పాపానికి అంబుధారకి, మనస్సుకి అబ్జానికి అభేదం చెప్పబడింది. కనుక ఇది రూపకాలంకారం.
సంపదలు ఆకర్షణీయాలు, అస్థిరాలు, కనులు మిరుమిట్లు గొలుపుతాయి కనుక మెఱుపుతీగలతో పోల్చటం సముచితం.
‘చిత్’ భావన:
‘ చిత్’ అనగా శుద్ధజ్ఞానం. ‘ భావన’ అనగా ఒక భావాన్ని లేక ఒక అంశాన్ని మననం చేసి చేసి, ధ్యానం చేసి, దానిలో ఊరి దానిని వంట పట్టించుకొని, ఆ లక్షణం తనలో భాగం అయిపోవటం. ఉదాహరణకు భావన జీలకర్ర, భావన అల్లం మొదలైనవి. జీలకర్ర, లేదా అల్లం నిమ్మరసంలో భావన చెందినట్లు భక్తుడు భగవంతుడిలో భావన చెందాలి. అది కూడా చిద్రూపమైన భగవంతుడితో.

డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement