Sunday, May 5, 2024

మనిషి స్థాయిని దిగజార్చేకామ క్రోధ లోభాలు

మానవుని అంతర్గత శత్రువులు అరిషడ్వర్గాలు. అరిష డ్వర్గాలకు మూలాధారంగ చెప్పబడే కామక్రోధ లోభాలు మనిషి స్థాయిని దిగజార్చి నలుగురి ముందు దోషిగా నిలుపుతాయి. వ్యక్తిత్వంలో చెరగని మచ్చవేసి ఎంత గొప్పవాణ్నయినా అధమునిగా మారుస్తాయి.
శ్రీ మద్రామయణాన్ని రామ్‌చరిత్‌ మానస్‌ అనే పేరుతో హిందీ భాషలో రాసిన కవి, రామభక్తుడు గోస్వామి తులసీదాసు. ఆయన కామక్రోధ లోభాలవల్ల జరిగే అనర్థాల గురించి వివరిస్తూ చెప్పిన పద్యం-
తాత్‌ తీని అతి ప్రబల్‌ ఖల్‌
కామ క్రోధ్‌ అరు లోభ్‌
ముని విగ్యాన్‌ ధామ్‌ మన్‌
కర్‌హి నిమిస్‌ మహుం ఛోబ్‌
”మానవుని బలమైన శత్రువులుగా పిలవబడే కామ క్రోధ లోభాల్లో చిక్కుక్కున్న ఎంతటివారైనా అవి ఆడించే నాటకంలో పాత్రధారులు కావాల్సిందే. అపార జ్ఞాన సంపన్నులైన విద్వాం సులు, పండితులు, రుషులు, మునులు మనస్సుల్లో ప్రవేశించి కామక్రోధ లోభాల ప్రభావంతో చేయకూడని పనులు చేసి అప్రతిష్ట పాలు కావాల్సిందే” అంటాడు తులసీదాసు.
అందుకే మనస్సును అదుపులో పెట్టుకుని వ్యవహరించాలం టాయి మన పురాణ ఇతిహాసాలు. మహాత్ములు ”మనో నిగ్రహమే మహా సాధనం” అంటారు.
క్రోధం అనగా కోపం లేదా ఆగ్రహం. ఒకరి అభిప్రాయాన్ని ఇంకొకరు విమర్శించినా లేదా వ్యతిరేకించినా కలిగే ఉద్రేకమే కోపం. ఆవేశానికి లోను కావడం కూడా కోపమే. కోపం ఉంటే శత్రువుతో పనిలేదంటారు.
లోభం అంటే దురాశ, స్వార్ధ పరత్వం. ప్రతీది తనకే కావాలని అనుకోవడం లోభంగా చెప్పవచ్చు. తృప్తిలేని జీవితం లోభమ యం అంటారు.
భగవద్గీతలోని రెండో అధ్యాయమైన సాంఖస యోగంలోని 62వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ ”అర్జునా, ఇంద్రియాలుగా చెప్ప బడే కామం, క్రోధం, లోభం అనే విషయాల గురించి చింతన చేయడం వల్ల వాటి మీద ఆసక్తి పెరుగుతుంది. ఆ ఆసక్తి కోరికలను కలిగేటట్టు చేస్తుంది. ఆ కోరికల నుండే క్రోధం పుడుతుంది.
తీరని కోరిక వల్ల కలిగే క్రోధంతో స్వార్ధం అంటే లోభత్వం వస్తుంది” అంటాడు.
ప్రవచనకారులు వివరణ ఇస్తూ ”ఎన్నో అనర్థాలకు ఆలవా లమైన కామ క్రోధ లోభాలనే విషయ సంకల్పాన్ని మనస్సులోకి వచ్చీ రాగానే పెకిలించి వేయాలి. అలా చేయగలిగిన వాడు విజ్ఞు డు” అంటారు.
ఐదో వేదంగా పిలవబడే మహా భారతంలో నేటి మానవాళి ఎదుర్కొంటున్న ప్రతీ సమస్య కు సమాధానంగా దొరుకు తుంది. అందుకే మహా భార తంలో లేనిదేది ప్రపంచంలో లేదు. ప్రపంచంలో ఉన్న ప్రతీ ది మహా భారతంలో ఉంది అనేది అందరూ చెప్పుకునే మాట.
భారతంలోని పాత్రలన్నీ కామ క్రోధ లోభాలకు అద్దం పట్టేవే!
ద్రౌపదితో సహా పాండవులు అజ్ఞాత వాసంలో విరాట రాజు కొలువులో చేరి రాజుకు, రాణికి సహాయకులుగా, సేవకులుగా ఉంటూ రాజ్యం బాగోగులు చూస్తుంటారు. కీచకుడు విరాట రాజు భార్య సుదేష్ణకు తమ్ముడు. ఆయన మొదట విరాట రాజుకు రథ సారథిగా ఆ తరువాత విరాట రాజు (మత్స్య రాజ్యం)కు సైన్యాధి పతిగా ఉటూ అన్నీ తానై వ్యవహరిస్తూ ఉంటాడు. ద్రౌపదిని చూసి న కీచకుని మనసులో ఏర్పడిన మోహంతో ఆమెను చెరబట్టాలని చూస్తాడు.
అనేక విధాలుగా కోరిక తీర్చుకునే ప్రయత్నం చేసిన కీచకుని మోహ అంధకారం గురించి భీముడు విని కీచకున్ని హతమారు స్తాడు. కీచకుని మోహమే అతన్ని అంతం చేసింది.
శిశుపాలుడు ఛేది రాజ్య చక్రవర్తి ధర్మ రుషుని కుమారుడు. శిశుపాలుని తల్లి శుత్ర దేవి వసుదేవుని సోదరి. అంటే శ్రీ కృష్ణుని మేనత్త. మొదటి నుండి శ్రీ కృష్ణుడు అంటే గిట్టదు శిశుపాలుడుకి. పాండవులు చేసే రాజసూయ యాగంలో అగ్ర తాంబూలం శ్రీ కృష్ణునికి ఇచ్చి ఆయనను గౌరవించడం శిశుపాలునికి నచ్చదు. అనేక విధాలుగా పరమాత్ముడైన శ్రీకృష్ణుణ్ని దూషిస్తుంటాడు. పట్టరాని క్రోధంతో రగిలిపోతూ మేనత్త కిచ్చిన మాట ప్రకారం వంద తప్పులు క్షమించిన భగవానుడు వాగ్దానం నెరవేరడంతో ఆ రాజ సూయ యాగాల్లోనే వధిస్తాడు. శిశుపాలుని కోపానికి మరో కారణం. శిశుపాలునికి కాబోయే భార్య రుక్మిణిని శ్రీ కృష్ణుడు ఎత్తు కుపోవడం అనేది కూడా ఉందంటారు. ఏది ఏమైనా శిశుపాలునికి తన కోపమే తనకు శత్రువవుతుంది.
గాంధారి, ధృతరాష్ట్రుల నూర్గురు పుత్రులలో ధుర్యోధనుడు ప్రథముడు. పసితనం నుండి పాండవులపై ద్వేషం, అకారణ శత్రుత్వం పెంచుకుంటారు. తానే కౌరవ సామ్రాజ్యానికి రాజు కావా లనే లోభంతో ధుర్యోధనుడు, దుశ్వాసనుడు, కర్ణుడు, శకుని సహ కారంతో పాండవులను అనేక విధాలుగా కష్ట పెడు తుంటారు.
శ్రీ కృష్ణుడు ఎప్పటికప్పుడు దుర్యోధనుని దురాలోచనలను పటాపంచలు చేస్తుంటాడు. నిలువెల్ల స్వార్ధంనింపుకున్న దుర్యోధ నుడు, కౌరవ సభలోని పెద్దలైన భీష ్మ, ద్రోణాచార్య, కృపాచార్యుల వంటి వారు పాండవులకు అర్థ రాజ్యం పంచి ఇవ్వాల్సిందిగా చెబు తారు. అయినా పెడ చెవిన బెట్టి యుద్ధంలో గెలిచిన వారే రాజ్యాధి కారం చేపట్టాలని ఖరా ఖండిగా చెబుతారు. దాంతో మహా భారత యుద్ధం జరిగి అందులో దుర్యోధనుడు తన దాయాదులతో హతుడవుతాడు.
దుర్యోధనుడు తనను అంతం చేసుకోవడానికి కారణం అతని లోని స్వార్ధంతో కూడిన లోభత్వమే!
నేటి యువతీ యువకులు మోహం, క్రోధం, లోభంతో బల శాలురు. ధీమంతులు ఎలా నామరూపాలు లేకుండా నాశనమ య్యారోపైన తెలుపబడిన పాత్రలను అర్థం చేసుకుని తమ ప్రవర్త నలో , ప్రవృత్తులను తీర్చి దిద్దుకోగలిగితే మనం గొప్ప శీలవంతు లమై మనకున్న గౌరవ మర్యాదలు పెంచుకోగలం. భరతమాత ముద్దు బిడ్డలం కాగలం. అందుకే మనలో దాగి ఉండే మోహ, క్రోధ, లోభాలు మనసులోకి రాకుండా జాగ్రత్త పడితే మన గౌరవ, మర్యాదలు సురక్షితంగా ఉంటాయి. లేక పోతే వాటివల్ల మన స్థాయి దిగజారి సమా జంలో నగుబాటు కావాల్సి వస్తుంది.

– పరికిపండ్ల సారంగపాణి
9849630290

Advertisement

తాజా వార్తలు

Advertisement