Sunday, May 5, 2024

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈడీ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఎక్సైజ్‌ శాఖ ఇచ్చిన ఆధారాలను ఈడీ క్షుణ్ణంగా పరీశీలిస్తోంది. హైకోర్టు ఆదేశాలతో ఈడీకి ఎక్సైజ్‌ శాఖ కీలక ఆధారాలను సమర్పించింది. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో డిజిటల్‌ రికార్డ్స్‌, చార్జ్‌ షీట్స్‌, కాల్‌ డిటెయిల్స్‌ను ఈడీకి ఎక్సైజ్‌ శాఖ ఇచ్చింది. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో 800 పేజీల మొత్తం ఫైల్స్‌ను పరీశీలిస్తున్నామని ఈడీ వెల్లడించింది. 60 జీబీ వీడియో 10 ఆడియో ఆధారాలను క్షుణ్ణంగా ఈడీ పరిశీలిస్తోంది. డ్రగ్స్‌ లావాదేవీలు, మనీ ల్యాండరింగ్‌ వ్యవహారంపై ఈడీ కూపీ లాగుతోంది. 2017లో సేకరించిన ఆధారాలను పరీశీలించిన తర్వాత మరోసారి సినీ ప్రముఖులను ఈడీ విచారించనుంది.

ఇదిలా ఉండగా, ఎక్సైజ్‌ శాఖ ఇచ్చిన డాక్యుమెంట్లన్నీ అసంపూర్తిగా ఉన్నాయని ఈడీ గుర్తించింది. డ్రగ్స్‌ కేసులో చాలా మందిని విచారించిన ఎక్సైజ్‌ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వాటన్నింటినీ తమకు ఇవ్వలేదని, కేవలం 12 వీడియో ఆధారాలను మాత్రమే ఇచ్చిందని ఈడీ పేర్కొంది. అంతేకాకుండా డిజిటల్‌ ఆధారాలు కూడా అసంపూర్తిగా ఉన్నాయని, కొన్నింటిలో అసలు సమాచారం లేదన్నారు. డ్రగ్స్‌ కేసులో విచారణకు సంబంధించిన పూర్తి వివరాలను, ఆధారాలను ఇవ్వకపోవడం పట్ల ఈడీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ ఎక్సైజ్‌ శాఖ, ప్రభుత్వం కావాలని తమకు పూర్తి సమాచారం ఇవ్వకపోవడం సరైంది కాదని అధికారులు అంటున్నారు. మరో పక్క సీఎస్‌ సోమేష్‌కుమార్‌, ఎక్సైజ్‌ శాఖ సంచాలకులు సర్పరాజ్‌ అహ్మద్‌లపై హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఉన్న కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ కోసం ఈడీ ఎదురు చూస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement