Friday, April 26, 2024

సొంత ఓటీటీ ఆలోచనలో నాగార్జున

కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా హాళ్లు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో ఎవరికీ తెలియదు. కరోనా రక్కసికి భయపడి ప్రేక్షకులు కూడా థియేటర్స్ వైపు రావడానికే భయపడిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మళ్ళీ ఓటీటీ హవా మొదలైంది. కొత్త కొత్త సినిమాలు, సరికొత్త కంటెంట్‌తో రూపొందుతున్న వెబ్ సిరీస్‌లకు ఆడియెన్స్ అలవాటు పడిపోయారు. నిర్మాతలు కూడా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడం కోసం రిలీజ్ కాకుండా ఆగిపోయిన చిన్న సినిమాలను ఓటీటీ ప్లాట్ ఫామ్ మీదకు తీసుకొస్తున్నారు.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలుగులో తొలి ఓటీటీ ‘ఆహా’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే దారిలో సీనియర్ హీరో నాగార్జున అడుగులు వేయాలని ఆలోచిస్తున్నారు. తన స్నేహితులు కొందరితో కలిసి కొత్త తరహా ఓటీటికి సంబంధించి ఆయ‌న ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వైల్డ్ డాగ్ సినిమా ఓటీటిలో హిట్ అవ్వటం కూడా నాగ్ దృష్టి డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పడేలా చేసింది. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ వరసపెట్టి చిన్న సినిమాలు చేయటానికి సన్నాహాలు చేస్తోంది‌. ఈ యేడు మినిమం అరడజను సినిమాలు అయినా తన బ్యానర్ నుంచి రావాలని, అదీ ఫిల్మ్ స్టూడియో బ్యాచ్‌కు ఆఫర్స్ ఇవ్వటానికి అని నాగ్ ప్లాన్ చేసారట. ఈ సినిమాలు అన్ని ఓటీటీల కోస‌మేనని ఫిల్మ్ నగర్ టాక్. భవిష్యత్‌లో డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌లదే హవా ఉండబోతుందని, నాగార్జునకు ముందుచూపు ఎక్కువ గనుకే ఓటీటీలో అడుగు పెడుతున్నారని ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement