Tuesday, May 7, 2024

ఢిల్లి ఎయిర్‌పోర్టులో భారీగా పెరిగిన ప్రయాణికులు.. హైదరాబాద్‌లోనూ రికార్డు స్థాయిలో రాకపోకలు

న్యూఢిల్లి ఎయిర్‌పోర్టులో గతంలో ఎన్నడూ లేనంత రద్దీ పెరిగింది. ఈ ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్‌- అక్టోబర్‌ కాలంలో ప్రయాణికుల సంఖ్య 17 శాతం పెరిగి 6.53 కోట్లకు చేరింది. గత సంవత్సరం ఇదే కాలంలో ఈ సంఖ్య 4.17 కోట్లుగా ఉంది. ఢిల్లి ఎయిర్‌పోర్టులో నెలవారి ప్రయాణికుల వివరాలను జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్ శుక్రవారం నాడు విడుదల చేసింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో అక్టోబర్‌లో అత్యధికంగా 60.08 లక్షల మంది ప్రయాణికులు నమోదయ్యారు.

ఇది గత సంవత్సరం అక్టోబర్‌ కంటే 11 శాతం అధికమని పేర్కొంది. ఢిల్లిలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టును జీఎంఆర్‌ గ్రూప్‌కు చెందిన ఢిల్లి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ఫోర్టు లిమిటెడ్‌ (డీఐఏఎల్‌) నిర్వహిస్తోంది. ఈ ఎయిర్‌పోర్టులో జీఎంఆర్‌కు 64 శాతం వాటా ఉంది. 26 శాతం వాటా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కు ఉంది. ఫ్రాపోర్ట్‌ , ఎరామన్‌ మలేషియా సంస్థలకు చేరో 10 శాతం వాటాలు ఉన్నాయి. ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో ఢిల్లి విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు కూడా 5 శాతం పెరిగి 36,643కు చేరాయి.

- Advertisement -

హైదరాబాద్‌లోనూ రికార్డు పెరుగుదల…

జీఎంఆర్‌ ఆధ్వరంలో నడుస్తున్న హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నుంచి కూడా ఈ ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు రికార్డు స్థాయిలో ప్రయాణికుల రాకపోకలు నమోదయ్యాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే ప్రయాణికుల సంఖ్య 23 శాతం పెరిగి 1.42 కోట్లుగా నమోదైనట్లు జీఎంఆర్‌ తెలిపింది. ఇప్పటి వరకు ప్రయాణికుల సంఖ్యలో ఇదే అత్యధికమని పేర్కొంది.

ఆ ఆర్ధిక సంవత్సరం నెలవారీగా చూస్తే అత్యధికంగా అక్టోబర్‌లో 20.10 లక్షల మంది ప్రయాణించారు. గత సంవత్సరం అక్టోబర్‌తో పోల్చితే ఇది 14 శాతం ఎక్కువ. సెప్టెంబర్‌ 2023తో పోల్చితే అక్టోబర్‌లో ప్రయాణికుల సంఖ్య 6 శాతం ఎక్కువ. జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్ ఆధ్వర్యంలో ఉన్న గోవాలోని మనోహర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో 2023 అక్టోబర్‌లో 3,39,395 మంది ప్రయాణికులు నమోదయ్యారు. ఇది సెప్టెంబర్‌ నెలతో పోల్చితే 4 శాతం అధికమని తెలిపింది. గోవా ఎయిర్‌పోర్టు కొద్ది నెలల క్రితమే ప్రారంభమైంది.

కొత్తగా విశాఖ…

జీఎంఆర్‌ గ్రూప్‌ ప్రస్తుతం కొత్తగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టును భోగాపురంలో నిర్మిస్తోంది. ఇందు కోసం 3,200 కోట్లు సమీకరించింది. ఈ ఎయిర్‌పోర్టు మొత్తం నిర్మాణ వ్యయం 4,700 కోట్లు. గత నెలలో జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్‌ ్స ఇన్‌ఫ్రాస్రక్చర్‌ లిమిటెడ్‌ రెండో త్రైమాసిక ఆర్ధిక ఫలితాలు ప్రకటించింది. సంస్థ ఈ త్రైమాసికంలో నష్టాలను 190 కోట్లకు తగ్గించుకున్నట్లు తెలిపింది. గత సంవత్సరం ఇదే కాలంలో సంస్థ 197 కోట్ల నష్టాలను నమోదు చేసింది.

1.26 కోట్ల మంది ప్రయాణికులు…

దేశీయ విమాన మార్గాల్లో ఈ స ంవత్సరం అక్టోబర్‌లో 1.26 కోట్ల మంది ప్రయాణించారని పౌర విమాయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) తెలిపింది. 2022 అక్టోబర్‌లో ప్రయాణించిన 1.14 కోట్ల మందితో పోల్చితే, ఈ సంఖ్య 11 శాతం ఎక్కువని తెలిపింది. ఈ సంవత్సరం సెప్టెంర్‌లో 1.22 కోట్ల మంది ప్రయాణించారు. 79.07 లక్షల మందిని ప్రయాణికులతో 62.6 శాతం మార్కెట్‌ వాటాను ఇండిగో సాధించింది. సెప్టెంబర్‌లో సంస్థ వాటా 63.4 శాతంగా ఉంది.

ఎయిర్‌ ఇండియాలో సెప్టెంబర్‌తో 9.8 శాతం నుంచి అక్టోబర్‌లో 10.5 శాతానికి పెరిగింది. విస్తారా వాటా 9.7 శాతానికి, ఎయిర్‌ ఏషియా ఇండియా వాటా 6.6 శాతానికి తగ్గింది. స్పైస్‌జెట్‌ వాటా 4.4 శాతం నుంచి 5 శాతానికి పెరిగింది. ఆకాశ ఎయిర్‌ వాటా 4.2 శాతంగా మార్పులేకుండా ఉంది. ఈ సంవత్సరం జనవరి నుంచి అక్టోబర్ వరకు మొత్తం 12.55 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు. గత సంవత్సరం ఈ సంఖ్య 9.88 కోట్లుగా ఉంది. అంటే వార్షికంగా 26.98 శాతం ప్రయాణికులు పెరిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement