Wednesday, May 1, 2024

మూన్‌లైటింగ్‌ చేస్తే పన్ను తప్పవు ! ఐటీ చెల్లించాల్సిందే అంటున్న నిపుణులు

అదనపు ఆదాయం కోసం ఐటి రంగంలో చాలా మంది ఉద్యోగులు ఖాళీ సమయాల్లో మరో సంస్థకు ప్రాజెక్ట్‌లు చేసిపెడుతున్నారు. ఇలాంటి వారు పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆర్ధిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అదనపు ఆదాయాన్ని కచ్చితంగా ఆదాయ పన్ను రిటర్నుల్లో చూపించాల్సి ఉంటుందని ట్యాక్స్‌ కన్సల్టెంట్లు చెబుతున్నారు. ఇలా చూపించకుంటే ఐటీ శాఖ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఫ్రీలాన్సింగ్‌, కన్సల్టెన్సీ, కాంట్రాక్ట్‌ ఇలా ఎలాంటి ఉద్యోగమైనప్పటికీ అది ఆదాయ పనను విభాగానికి తెలియకుండా ఉండదని అభిప్రాయపడుతున్నారు. మూన్‌లైటర్లకు కంపెనీలు వేతనం లేదంటే ప్రొఫెసనల్‌ ఫీజు రూపంలో పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

ఈ రెండూ ఆదాయ పన్ను రికార్డులో నమోదవుతాయని వీరు తెలిపారు. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 194 సీ ప్రకారం, 30 వేల రూపాయల కంటే ఎక్కువ చెల్లించే కంపెనీలకు నిర్ధేశిత రేటు తో టీడీఎస్‌ కట్‌ అవుతుంది. లేకుంటే జీఎస్టీ కింద ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌(ఐటీసీ) క్లెయిం కోసమైనా కంపెనీలు దరఖాస్తు చేసుకుంటాయి. ఈ రెండు సందర్భాల్లో ఆ లావాదేవీలు ఐటీ రికార్డుల్లో నమోదవుతాయి. మరో వైపు ప్రతి కంపెనీ తమ చెల్లింపుల వివరాలను డిసెంబర్‌ లేదా జనవరిలో కచ్చితంగా ఐటీ విభాగానికి సమర్పిస్తాయి. కాబట్టి మూన్‌లైటర్లు పొందే ఆదాయాన్ని దాచిపెట్టేందుకు ఎక్కడా ఆస్కారం ఉండదు.

- Advertisement -

ఒకసారి కంపెనీలు తమ చెల్లింపులను టీడీఎస్‌ లేదా ఐటీసీ కింద రికార్డు చేశాయంటే ఆ మొత్తం పొందినవారి 26ఏఎస్‌ ఫారంలో ఆ లావాదేవీ వివరాలన్నీ కనబడతాయి. ఈ నేపథ్యంలో మూన్‌లైటర్లు పొందుతున్న అదనపు ఆదాయాన్ని దాచడానికి అవకాశం ఉందని నిపుణులు వివరిస్తున్నారు. ఉద్యోగులు కంపెనీ నుంచి ఫారం 16ను పొందాల్సి ఉంటుంది. ఇందులో వేతనం ద్వారా పొందుతున్న ఆదాయం, దానిపై ఐటీఎస్‌కు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఉద్యోగి అదనపు పని చేయడం ద్వారా పొందుతున్న ఆదాయం గురించి సంస్థకు తెలిసే అవకాశం లేదు.

ఫారం 26ఏఎస్‌ చూస్తేగాని ఈ విషయం వారికి తెలియదు. కాబట్టి కంపెనీకి దొరక్కుండా మూన్‌లైటింగ్‌ చేసినప్పటికీ, పన్ను విభాగం నుంచి తప్పించుకోవడం మాత్రం కుదరదు. సాధారణంగా ఐటీఆర్‌లో ఉద్యోగుల తమ ఆదాయాన్ని వేతనం, లాభాలు, అనే రెండు కేటగిరీల కింద చూపించాల్సి ఉంటుంది. వేతనం కింద ప్రధాన కంపెనీ నుంచి పొందుతున్న ఆదాయాన్ని చూపించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరో ఉద్యోగం ద్వారా పొందుతున్న ఆర్ధనను ఖర్చులన్నీ ఈసేసి లాభల కింద చూపించాలని సలహా ఇస్తున్నారు. అంటే వీరు చేస్తున్న ఉద్యోగానికి అయ్యే ప్రతి ఖర్చును తీసేసి మిగిలిన మొత్తాన్ని ప్రొఫెషన్‌ ద్వారా పొందుతున్న లాభాల కింద పేర్కొనాల్సి ఉంటుంది. ఒక వేళ పొందుతున్న అదనపు ఆదాయం మొత్తం ఒక ఏడాదిలో 20 లక్షల రూపాయలు దాటితే దానిపై జీఎస్టీ కూడా కట్టాల్సి ఉంటుందని ట్యాక్స్‌ నిపుణులు చెబుతున్నారు. మూన్‌లైటింగ్‌ ద్వారా పొందుతున్న అదనపు ఆదాయానికి తప్పనిసరిగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే ఐటీ శాఖ ఇచ్చే నోటీస్‌ల వల్ల ఇబ్బందులు తప్పవని వీరు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement