Saturday, May 4, 2024

భారత్‌లో పెరిగిన ఐఫోన్ల తయారీ.. మరో కొత్త కంపెనికి కాంట్రాక్ట్‌

మన దేశంలో ఐఫోన్‌ 14 తయారీని మరో కంపెనీ కూడా చేపట్టింది. తైవాన్‌కు చెందిన పెగాట్రాన్‌కు కూడా యాపిల్‌ ఈ కాంట్రాక్ట్‌ను అప్పగించింది. ఫాక్స్‌కాన్‌ కంపెనీ తమ అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే చెన్నయ్‌లోని ప్లాంట్‌లో ఐఫోన్‌ 14ను అసెంబుల్‌ చేస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఐఫోన్‌ తయారీ కేంద్రం చైనాలో ఉంది. కరోనా కేసులు పెరగడంతో చైనా ప్రభుత్వం ఈ ప్లార్‌ చుట్టూ కఠిన ఆంక్షలు విధించింది. దీంతో ఐఫోన్ల తయారీ, సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్ల అమ్మకాలపై ప్రభావం చూపుతోంది. దీంతో యాపిల్‌ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.
చైనాలో గతంలోనూ కోవిడ్‌ మూలంగా ఇబ్బందులు వచ్చాయి.

దీనికి తోడు చైనా, అమెరికా మధ్య ముదురుతున్న విబేధాలు, వాణిజ్య పరమైన వివాదాలు కూడా యాపిల్‌కు ఇబ్బందులు కల్గిస్తున్నాయి. వీటి నుంచి బయట పడేందుకు ఐఫోన్‌ తయారీని చైనా బయట కూడా పెద్ద ఎత్తున చేపట్టాలని యాపిల్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇండియాలో ఐఫోన్ల తయారీ, సరఫరాలను పెంచాలని నిర్ణయించింది. మన దేశంలో ఫాక్స్‌కాన్‌, విస్ట్రాన్‌, పెగాట్రాన్‌ యాపిల్‌ కాంట్రాక్ట్‌ తయారీ భాగస్వాములుగా ఉన్నాయి. ఇవన్నీ తమ తయారీ సామర్ధ్యాన్ని పెంచుకుంటున్నాయి. లాక్‌డౌన్‌ ఆంక్షల మూలంగా చైనాలో తగ్గుతున్న తయారీని మన దేశంలో పెంచడం ద్వారా సమతౌల్యం చేస్తోంది. చైనాలో కొత్త సంవత్సరం సందర్భంగా భారీగా ఐఫోన్ల విక్రయాలు జరుగుతాయి. అందుకే యాపిల్‌ తన ఐ ఫోన్ల తయారీని పెంచుకునేందుకు కొత్తగా ఇండియాలో బెంగళూర్‌లో ఉన్న తైవాన్‌కు చెందిన కంపెనీ పెగాట్రాన్‌కు తయారీ కాంట్రాక్ట్‌ను అప్పగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement