Thursday, May 2, 2024

ఎన్‌డీటీవీ కొనుగోలుకు ఓపెన్‌ ఆఫర్‌.. కొత్త తేదీ ప్రకటించిన అదానీ

ఎన్‌డీటీవీలో 26 శాతం వాటాల కొనుగోలుకు ఓపెన్‌ ఆఫర్‌కు అదానీ గ్రూప్‌ కొత్త తేదీని ప్రకటించింది. ఈ మేరకు గ్రూప్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. నవంబర్‌ 22న ఈ ఓపెన్‌ ఆఫర్‌ ప్రారంభమై డిసెంబర్‌5న ముగుస్తుంది. ఇంతకు ముందు అక్టోబర్‌ 17న ప్రారంభమై నవంబర్‌1 వరకు ఓపెన్‌ ఆఫర్‌ ముగియాల్సి ఉంది. ఎన్‌డీటీవీలో వాటాలు కొనుగోలు చేసినట్లు అదానీ గ్రూప్‌ ఆగస్టులో ప్రకటించిన విషయం తెల్సిందే. ఎన్‌డీటీవీ ప్రమోటర్లకు చెందిన ఆర్‌ఆర్‌పీఆర్‌కు గతంలో విశ్వప్ర్రదాన్‌ కమర్షియల్‌(విసీపీఎల్‌) ఇచ్చిన రుణాన్ని వాటాలుగా మార్చుకుంటున్నట్లు తెలిపింది.

దీనిపై ఎన్‌డీటీవీ ప్రమోటర్లు అభ్యంతరం చెప్పారు. ఈ వివాదంలో చివరకు అదానీ గ్రూప్‌కు లైన్‌ క్లీయర్‌ అయ్యింది. దీంతో మిగిలిన 26 శాతం వాటాను కూడా దక్కించుకునేందుకు అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. 4 రూపాయల ముఖ విలువ కలిగిన 1.67 కోట్ల షేర్లను అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌లో కొనుగోలు చేయనుంది. ఇందుకు ఒక్కో షేరును 294 రూపాయలుగా నిర్ణయించారు. ఎన్‌డీటీ ప్రమోటర్‌ కంపెనీ అయిన ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ విశ్వప్రదాన్‌ కమర్షియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(వీసీపీఎల్‌) 403.85 కోట్ల రూపాయల రుణం ఇచ్చింది. రుణాన్ని తిరిగి చెల్లించలేకుంటే దీన్ని ఆర్‌ఆర్‌పీఆర్‌లో 99.9 శాతం వాటాగా మార్చుకోవచ్చని ఒప్పందం చేసుకున్నారు.

ఎన్‌డీటీవీకి రాధికా రాయ్‌, ప్రణయ్‌రాయ్‌ దంపదులు ప్రధాన ప్రమోటర్లుగా ఉన్నారు. తరువాత కాలంలో వీసీపీఎల్‌ చేతులుమారి అదానీ గ్రూప్‌కు వచ్చింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఎన్‌డీటీవీలో 29.18 శాతం వాటాగా మార్చుకుంది. దీనికి అదనంగా ఇప్పుడు ఓపెన్‌ ఆఫర్‌తో మరో 26 శాతం వాటాలను కొనుగోలు చేయనుంది. దీంతో ఎన్‌డీటీవీలో అదానీ గ్రూప్‌కు సగానికి పైగా వాటా సొంతం అవుతుంది. దీ ని వల్ల ఎన్‌డీటీవీ యాజమాన్య హక్కులు కూడా అదానీ గ్రూప్‌కు దక్కనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement