Monday, May 6, 2024

మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి.. ఎందుకంటే?

బ్యాంకు లావాదేవీలు చేసేటప్పుడు, ఇతర అనేక రకాల కార్యకలాపాలకు మన స్మార్ట్ ఫోన్‌కు OTP వస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం అర్థరాత్రి నుండి దేశ వ్యాప్తంగా అనేక బ్యాంకింగ్ సేవలు, ఇతర అంశాలకు సంబంధించిన OTPలు, SMS మెసేజ్‌లు చాలా మందికి స్తంభించిపోయాయి.

దీనికి ప్రధాన కారణం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కొత్త నియమ నిబంధనలు అందుబాటులోకి తీసుకురావడం. ఇటీవల దేశవ్యాప్తంగా అవాంఛిత ప్రమోషనల్ కాల్స్, ఫిషింగ్ కాల్స్ వంటివి పెరుగుతూ ఉండడంతో అలాంటి వాటికి అడ్డుకట్ట వేయడం కోసం TRAI 2019లో కొత్త బ్లాక్ ఛైన్ టెక్నాలజీని అమలు పరచాలని టెలికాం కంపెనీలను ఆదేశించింది. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు అది పెండింగ్‌లోనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా దానిని తప్పనిసరి చేయడంతో, ఆ సరికొత్త మార్పులను అమలుపరిచే ప్రయత్నంలో టెలికాం కంపెనీల SMS సేవలకు కొంత సమయం పాటు తీవ్ర విఘాతం కలిగింది. ఈ కొత్త నియమాల ప్రకారం ఇక మీదట వినియోగదారులకు SMSలను పంపించే కంపెనీలు, బ్యాంకులు, పేమెంట్ కంపెనీలు, ఆధార్ వంటి సేవలు అందించే గవర్నమెంట్ ఏజెన్సీలు కొన్ని మెసేజింగ్ టెంప్లేట్లని తయారుచేసుకుని అందులో సూచించిన విధంగా మాత్రమే వినియోగదారులకు సందేశాలు పంపించవలసి ఉంటుంది.

ఈ కొత్త నియమాలు అందుబాటులోకి వచ్చిన దరిమిలా, తాత్కాలికంగా సేవలకు విఘాతం కలగడంతో బ్యాంకులు అతి ముఖ్యమైన సందేశాలను పంపించడానికి ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేశాయి. రాబోయే ఒకటి, రెండు రోజుల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ లోపల మీకు ఏదైనా సర్వీసుకి సంబంధించి SMS మెసేజ్ రాకపోతే ఆందోళన చెందకండి. కీలకమైన లావాదేవీలు నిర్వహించడం కోసం ఈ OTPలు తప్పనిసరి అయినప్పటికీ.. కొత్త నియమాల వల్ల స్పామ్ చాలావరకు తగ్గిపోతుంది కాబట్టి తాత్కాలికంగా కలిగిన అసౌకర్యాన్ని భరించక తప్పదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement