Thursday, May 2, 2024

Yuvagalam – రోడ్లపై నాట్లు వేసి నారా లోకేష్ నిర‌సన‌

గోపాల‌పురం – టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో, రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారిన రోడ్ల పరిస్థితిపై నిరసిస్తూ లోకేష్ వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు. గోపాలపురం నియోజకవర్గం చీపురుగూడెంలో యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్న సమయంలో నీళ్లు నిలిచి అధ్వానంగా ఉన్న రోడ్డు కన్పించింది. దాంతో ఆయన రోడ్ల దుస్థితిపై స్పందించారు. రోడ్ల దుస్థితిని వివరిస్తూ రహదారిపై వరి నారు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో రోడ్లన్నీ దుర్భరంగా తయారయ్యాయని విమర్శించారు. గత నాలుగేళ్లుగా కాంట్రాక్టర్లకు రూ.1.30 లక్షల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టారని ఆరోపించారు. దివాలాకోరు ముఖ్యమంత్రి ముఖంచూసి రోడ్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదని లోకేష్ వెల్లడించారు.
గత టీడీపీ ప్రభుత్వంలో రికార్డు స్థాయిలో 25 వేల కి.మీ. సిమెంటు రోడ్లు వేసినట్టు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనీసం రోడ్లపై తట్ట మట్టి పోసే దిక్కులేకుండా పోయిందని అన్నారు. రోడ్ల కోసం అంతర్జాతీయ సంస్థల నుంచి తెచ్చిన నిధులను కూడా జగన్ దారి మళ్లించారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో పాడైపోయిన రోడ్లన్నింటినీ పునర్నిర్మిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement