Thursday, May 2, 2024

టీటీడీకి కొత్త బోర్డు ఏర్పాటు చేయండి: జగన్‌కు రఘురామ లేఖ

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి నూతన బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సీఎం జగన్​కు లేఖ రాశారు. తిరుమలలో స్పెసిఫైడ్ అథారిటీతో కొత్త వివాదానికి తెరదీశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టాన్ని అపహాస్యం చేసేలా 146 జీవో విడుదల చేశారన్నారు. పాలకమండలి స్థానంలో స్పెసిఫైడ్‌ అథారిటీ ఏర్పాటుపై ప్రజల్లో ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికే జీవో అన్న అభిప్రాయం ఉందన్నారు. హిందూ ధర్మం ఆచరించే పలువురి నమ్మకాలను గాయపరుస్తోందని రఘురామ అన్నారు. ఇద్దరు సభ్యులతో అథారిటీ ఏర్పాటు చేస్తే నిర్ణయాలపై చర్చకు వీలుండదని, ట్రస్టు బోర్డు అధికారాలను అథారిటీకి బదిలీ చేసినట్లు అర్థమవుతోందన్నారు. కొత్త స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటుపై ఎవరికీ నమ్మకం కలగట్లేదని అభిప్రాయపడ్డారు. దేవుడి సొమ్ము దారి తప్పిస్తారేమోనని కూడా ఆందోళన చెందుతున్నారని చెప్పారు. అథారిటీకి ఆర్థిక విషయాలపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని తీసేయాలని డిమాండ్ చేశారు. కొత్త బోర్డు ఏర్పడ్డాకే ఆర్థిక నిర్ణయాలు తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. కాలయాపన చేయకుండా నూతన బోర్డు ఏర్పాటు చేయాలని రఘురామ డిమాండ్ చేశారు.

కాగా, టీటీడీ ధర్మకర్తల మండలి పదవీకాలం ముగియడంతో స్పెసిఫైడ్‌ అథారిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ ఛైర్మన్‌గా డాక్టర్‌ కెఎస్‌.జవహర్‌రెడ్డి, కన్వీనర్‌గా ఎవి ధర్మారెడ్డిలు శ్రీవారి ఆలయంలో గురువారం(జూన్ 24) ప్రమాణస్వీకారం చేశారు.

ఇదీ చదవండి: WTCలో రవిచంద్రన్ అశ్విన్ రికార్డు

Advertisement

తాజా వార్తలు

Advertisement