Saturday, May 4, 2024

AP : నిన్న భ‌ర్త హ‌త్య…నేడు గుండెపోటుతో భార్య క‌న్నుమూత

మేనల్లుడే కాలయముడయ్యాడు. వ్యక్తిగత కక్షతో సొంత మామను కత్తితో గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. మాజీ ప్రిన్సిపాల్‌ మూర్తిరావు హత్య కేసు అనంతను ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఈలోపు మరో విషాదం చోటు చేసుకుంది. భర్త మృతి తట్టుకోలేక.. ఆయన భార్య శోభ సైతం గుండెపోటుతో కన్నుమూశారు.

- Advertisement -

పోలీసులు తెలిపిన మేరకు… అనంతపురం జిల్లా పామిడికి చెందిన మూర్తిరావు ఖోకలే దశాబ్దాల క్రితమే అనంతపురంలోని జేఎన్‌టీయూఏ ప్రధాన ద్వారం ఎదురుగా స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. జేఎన్‌టీయూ ప్రధాన ద్వారం ఎదురుగా మూర్తిరావుకు షాపింగ్‌ కాంప్లెక్స్‌తో పాటు సొంతిల్లు ఉంది. అన్నింటినీ అద్దెకు ఇచ్చేసి నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కుటుంబసభ్యులతో కలసి ఉంటున్నారు. ఈ క్రమంలో తన ఇంట్లో నివాసముంటున్న మణికంఠ ఇల్లు ఖాళీ చేసి ఆదివారం మూర్తిరావుకు ఫోన్‌ చేశాడు. వచ్చి ఇంటిని పరిశీలించుకుని తాళం తీసుకెళ్లాలని సూచించాడు. దీంతో తన భార్య శోభాతో కలసి ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు

భార్య క‌ళ్ల‌ముందే భ‌ర్త హ‌త్య‌..
ఇంటిని పరిశీలిస్తూ శోభ లోపలకు వెళ్లారు. అదే సమయంలో అక్కడే పొంచి ఉన్న మేనల్లుడు ఆదిత్య లోపలకు చొరబడి కత్తితో మూర్తిరావు (58) గొంతులోకి పొడిచాడు. రెప్పపాటులోనే పలు మార్లు పొడిచి, అనంతరం అదే కత్తితో గొంతుకోశాడు. కళ్ల ముందే జరుగుతున్న దారుణం చూసి, భయపడిన శోభ గట్టిగా కేకలు వేస్తూ కుప్ప‌కూలిపోయింది.. నేటి ఉద‌యం ఆమెకు గుండెపోటు రావ‌డంతో హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లిస్తుండ‌గానే క‌న్నుమూసింది.. . శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం పినదర్రి గ్రామ జెడ్పీహెచ్‌ఎస్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌గా ఆమె పనిచేస్తున్నారు. కొడుకు ఉజ్వల్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా, కుమార్తె వైష్ణవి బెంగళూర్‌లో బ్యాంక్‌ ఉద్యోగిగా స్థిరపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement