Saturday, May 4, 2024

వైసిపివి అన్నీ దొంగ స‌ర్వేలే – ఫ్యాన్ కి 14 శాతం ఓట్లు కూడా రావ‌న్న చంద్ర‌బాబు

అమ‌లాపురం – వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీవి దొంగ సర్వేలు అంటూ విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన మహిళా ప్రగతి కోసం ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీవి దొంగ సర్వేలు.. వచ్చే ఎన్నికలలో వైసీపీ గెలుపు కలగా జోస్యం చెప్పారు. వైసీపీకి 14 శాతం ఓట్లు కూడా రావన్న ఆయన మహిళలు మోసకారి జగన్‌ను సాగనంపండి అంటూ పిలుపునిచ్చారు. మహిళా సాధికారతే ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిందని తెలిపారు. ప్రతీ ఇంట్లో మహిళలే ఆర్థిక మంత్రి అని, సూపర్ సిక్స్ లో భాగంగా మహాశక్తికి మొదటిగా ప్రాధాన్యత కల్పించామని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు.

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాకు ఒకటి, కొన్ని జిల్లాలకు ఒకటి కంటే ఎక్కువ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. మెడిసిన్ తో పాటు పారా మెడికల్ విద్యార్థులకు భవిష్యత్తులో డిమాండ్ పెరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.ఆర్థిక సంస్కరణలు వచ్చాక పోటీతత్వం పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు పెడితే తనను ఎగతాళి చేశారని చంద్రబాబు గుర్తుచేశారు. అయితే, అందులో చదువుకున్న విద్యార్థులు ప్రస్తుతం విదేశాలలో స్థిరపడ్డారని చెప్పారు. ప్రపంచాన్ని జయించే శక్తి మన దేశ యువతలోనే ఉందని చంద్రబాబు తెలిపారు.

సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు చంద్రబాబు.. 1996 తుపాను సమయంలో కోనసీమ ప్రాంతం విచ్ఛిన్నమయితే.. నా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రాజమహేంద్రవరం కేంద్రంగా సెక్రటేరియట్ ఏర్పాటు చేసి సమస్యలను పూర్తిగా పరిష్కరించామని గుర్తుచేసుకున్నారు. మా తల్లి పడిన కట్టెల పొయ్యి కష్టాన్ని చూసి తట్టుకోలేక ఆడ బిడ్డలను ఆదుకునే విధంగా దీపం పథకాన్ని ప్రారంభించానన్న ఆయన ప్ర‌స్తుతం జ‌గ‌న్ పాల‌న‌లో వైకుంఠపాళీ మాదిరిగా మారింది ప్రస్తుత పరిస్థితి.. తాను అభివృద్ధి చేస్తే.. వాటిని వీళ్ళు నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, ఆక్వా రైతాంగాన్ని వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్ పై పెట్టేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలు ఓపిక పట్టండి ఆక్వా రైతాంగాన్ని ఆదుకుంటామని ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు.

ప్రభుత్వం కానీ, ఏ రంగంలోనైనా కానీ మనం ప్లాన్ చేసి, ఎగ్జిక్యూట్ చేసిన పనులను అదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లే నాయకత్వం కావాలని చంద్రబాబు చెప్పారు. దురదృష్టవశాత్తూ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అదే కొరవడిందని అన్నారు. సమాజంలో పది శాతం ఉన్న వారికి మేలు చేయడం కాకుండా నిరుపేదలకు మూడు పూటలా తిండి లభించేలా, సామాన్యులు ఆర్థికంగా పైకి ఎదిగేలా చేయడమే లక్ష్యంగా తాను పాలసీలు సిద్ధం చేశానని చంద్రబాబు తెలిపారు. అది సాధ్యమేనని, తమ ప్రభుత్వం చేసి చూపిస్తుందని స్పష్టం చేశారు. తెలివి ఉన్నవారు, అవకాశం ఉన్నవారు ముందుకు వెళ్లడమే కాకుండా అవకాశాలు లేని వారిని వారి వెంట తీసుకెళ్లాలని అన్నారు. పేదవారిని ధనవంతులుగా చేయడమే నిజమైన సంతృప్తి అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement