Monday, April 29, 2024

యావత్‌ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తా..: మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం : ఇప్పటికే కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు పట్టణంలో పూర్తయ్యాయిని, అసంపూర్తిగా ఉన్న మిగిలిన సమస్యల పై అధికారులను సమన్వయపర్చి యావత్‌ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తానని రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని ) తెలిపారు.
గురువారం ఉదయం 7 గంటల సమయంలో ఆయన మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 46 , 47 వ డివిజన్లకు సంయుక్తంగా ఈడేపల్లి వయోవృద్ధుల న్యాయ సేవ కేంద్రం రోడ్డులో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. 15వ ఆర్ధిక సంఘ నిధులు 52 లక్షల 67 వేల రూపాయల వ్యయంతో 620 మీటర్ల పొడవు సిమెంట్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, జెట్టి వారి తోట రోడ్డు మల్లయ్య స్వీట్స్ దుకాణం నుంచి బైపాస్ రోడ్డు జడ్జి గారి బంగ్లా నుంచి వెళ్ళే రోడ్డు వరకు అత్యధిక ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారని, 2004 సంవత్సరంలో తాను శాసనసభ్యునిగా గెలుపొందిన మొదటి ఆరునెలల వ్యవధిలోనే ఇక్కడ తారురోడ్డు నిర్మాణం చేపట్టానని, అయితే ఏడెనిమిదేళ్లు నుంచి ఈ రోడ్లు పాడై ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని , బైపాస్ రోడ్డు వాసులు బస్టాండ్ కు వెళ్లాలంటే , ఇదో దగ్గరి మార్గం అని వర్షాకాలంలో ఈ మార్గంలో కనీసం నడవలేని స్థితి ఉందని చెప్పారని గత ఎన్నికలలో ఈ రోడ్డు నిర్మాణ విషయమై స్థానికులు తనను అడిగారని ,తమ పార్టీ అధికారంలోనికి రాగానే తప్పక ఈ రోడ్డుకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ మాట నెరవేర్చుతున్నట్లు మంత్రి చెప్పారు.
ఈ కార్యక్రమంలో మచిలీపట్నం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్లు లంకా సూరిబాబు, తంటిపూడి కవిత థామస్ నోబుల్, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ షేక్ ముస్తఫా ( అచ్చాబా ), ధనికొండ నాగమల్లేశ్వరి శ్రీనివాస్, వైయస్సార్ పార్టీ అధికార ప్రతినిధి మాదివాడ రాము, మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement