Tuesday, April 30, 2024

ప్రభుత్వ ఆధిపత్య ధోరణితో.. ఉద్యోగులకు ఊరట లేదు: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన డిమాండ్ల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధి కనపరచకుండా ఆధిపత్య ధోరణిలో వెళ్లింద‌ని జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ విమర్శించారు. ఈ మేర‌కు ఆదివారం జనసేన పార్టీ ట్విట్టర్​లో ప్రకటన రిలీజ్ చేశారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యాల ఫలితంగా ఉద్యోగులకు ఊరట లభించ లేద‌ని, ఫిట్మెంట్, గత హెచ్.ఆర్.ఏ కొనసాగింపు, అశుతోష్ క‌మిటీ నివేదిక ఇవ్వడం లాంటి ప్రధాన డిమాండ్లతో విజయవాడలో ఉద్యోగులు ఉవ్వెత్తున చేసిన భారీ ర్యాలీ ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేసింద‌న్నారు.

ఇవన్నీ నరవేరకుండానే ఐ. ఆర్., హెచ్. ఆర్.ఏ., క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రికవరీని పాక్షికంగా చేసినా సరే.. సమ్మె ఉపసంహరించుకొని ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాల్సిన పరిస్థితిని పి.ఆర్.సి. స్టీరింగ్ కమిటీ నాయకులకు ప్రభుత్వం కల్పించింద‌న్నారు. ఈ ఉపసంహరణ ప్రకటనపై ఉపాధ్యాయ సంఘాలు విభేదించిన విషయాన్ని, వారు ప్రస్తావిస్తున్న అంశాలను జనసేన పరిగణనలోకి తీసుకొంటోంద‌ని చెప్పారు. ప్రభుత్వ వైఖరితో నష్టపోయిన ఉద్యోగ వర్గం పట్ల జనసేన పార్టీ సానుకూల దృక్పథాన్ని కనబరుస్తోంద‌ని, వారి భావోద్వేగాలకు విలువ ఇస్తోంద‌ని పేర్కొన్నారు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement