అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో దారుణం జరిగింది. భర్తను లేపేస్తే అప్పులన్నీ తీరుతాయన్న దురాలోచనతో ఓ కుటుంబం మొత్తం కలిసి ఇంట్లో బంధించి విషపు గుళికలు తాగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. కోడూరు రైల్వే స్టేషన్ రోడ్డులో కిరణా షాపు నడుపుతున్న కొండమణికి ఈ పరిస్థితి ఎదురయ్యింది. తన భార్యతో రోజూ గొడవలు జరిగేవని, విలాసాలకు అలవాటుపడ్డ తన భార్య కోరికలు తీర్చలేక పెద్దమొత్తంలో అప్పులు చేసినట్టు ఆయన తెలిపినట్టు సమాచారం.
అయితే.. రోజువారీగా షాపు నడపడం ద్వారా వచ్చే దాదాపు 30వేల రూపాయలు అప్పులకు, కుటుంబ ఖర్చులకు సరిపోతున్నాయని, ఇంకా తన నుంచి అంతకుమించి కావడం లేదని గమనించిన కొండమణి భార్య.. చేసిన అప్పులు తీరాలంటే అతడిని లేపెయ్యాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో కుటుంబీకులే రెండు రోజులపాటు అతడిని బంధించి విషపు గుళికలు తినిపించినట్టు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.