Monday, April 29, 2024

ఉక్కు మా హ‌క్కు…

విశాఖపట్నం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను విక్రయించే హక్కు కేంద్రప్రభుత్వానికి లేదని, తక్షణమే రాజకీయ పక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి పోరాడాల్సిన అవసరం ఉందని పలు కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. పరిశ్రమలు ప్రయివేటీకరణ అంటే దేశాన్ని కొల్లగొట్టడమేనని నేతలంతా కేంద్రంపై విరుచుకుప డ్డారు. విశాఖ ఉక్కు గర్జన పేరిట విశాఖస్టీల్‌ప్లాంట్‌ ఆవరణ లో ఉన్న త్రిష్ణా గ్రౌండ్స్‌లో ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ నిర్వహించారు. ఈ సభకు దేశవ్యాప్తంగా అనేక కార్మిక యూనియన్లకు చెందిన జాతీయ నాయకులంతా హాజరై కీలకంగా ప్రసంగించారు. సభలో ఇంటక్‌ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి , సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌, ఏఐటియుసి ప్రధాన కార్య దర్శి అమర్‌జిత్‌ కౌర్‌, హెచ్‌ఎమ్‌ఎస్‌ జాతీయ ఉపాధ్యక్షులు రియాజ్‌ అహ్మద్‌, బిఎమ్‌ఎస్‌ జాతీయ కార్యదర్శి డి.కె. పాండే, వైఎస్‌ఆర్‌టిసి రాష్ట్ర అధ్యక్షులు పి.గౌతమ్‌రెడ్డి, టిఎన్‌టియుసి రాష్ట్ర అధ్యక్షులు జి.రఘురామరాజు తది తరులు ప్రసంగాలుతో ఉక్కు గర్జన భారీగా విజయవంత మైంది. ఈ సందర్భంగా జాతీయ నేతలు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ముక్తకంఠంతో పోరాటం సాగిస్తామన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ను ఒక నిర్ణయంతో ప్రయివేటు యాజమాన్యానికి అమ్మాలను కోవడం కేంద్రానికి సరికాదని సూచించారు. 32 మంది ప్రాణ త్యాగంతో ఆంద్రుల సెంట్‌మెంట్‌గా ఏర్పడిన విశాఖ ఉక్కును నష్టాల పేరుతో విక్రయించాలని చూస్తున్నారని, అయితే సొంత గనులు కేటాయించి ఉంటే ఎప్పుడో స్టీల్‌ప్లాంట్‌ లాబాల బాటలో పయనించేదన్నారు. దేశంలోని కార్మిక సంఘాలన్నీ ఉక్కు పరిరక్షణకు సహకరిస్తాయని వీరంతా భరోసా ఇచ్చారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణలో రాజ్యాంగ బద్దంగా వచ్చిన రిజర్వేషన్లను తొలగించే దురాలోచన కేంద్రానికి ఉందని వీరంతా విమర్శించారు. దిల్లి లో రైతులు చేస్తున్న పోరాటం మాదిరిగానే విశాఖ ఉక్కు కోసం కూడా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఇందు కోసం దిల్లి లో రైతుల నేతల మద్దతు కూడా తీసుకోవాలని అఖిలపక్షానికి సూచించారు.
ఈనెల 28న విశాఖనగరంలో జరిగే బహిరంగసభకు వారిని ఆహ్వానిస్తామన్నారు. క్షణికావేశంలో ఏ ఒక్కరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని వీరు పిలుపునిచ్చారు. స్టీల్‌ పరిరక్షణ కోసం ధైర్యంగా అందరూ కలిసి పోరాటం సాగించాల న్నారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. ప్రయివేటుపరం చేస్తే కార్మిక చట్టాలు కనుమరుగవుతాయని నేతలంతా ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పోరాటానికి దేశ వ్యాప్త మద్దతు లభిస్తుందన్నారు. ఉక్కు పరిరక్షణకు జాతీయ స్థాయిలో ప్రత్యక్ష పోరాటం చేస్తామన్నారు. పోరాటానికి నైతిక మద్దతు సరిపోదని సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ మండిపడ్డారు. కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా స్టీల్‌ప్లాంట్‌ తీసుకోవడం లేదన్నారు. కాని ఉక్కు పరిశ్రమ నష్టాల్లో ఉందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచంలో ఏ ఉక్కు పరిశ్రమకైనా గత ఏడాది లాభాలు వచ్చాయా అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. గత కొన్ని నెలలుగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ మాత్రమే లాభాలు సాధిస్తుందన్నారు. ప్రయివేటీకరణ అంటే దేశాన్ని కొల్లగొట్టడమేనని తపన్‌సేన్‌ విమర్శించారు. ఉక్కు బహిరంగసభకు వేలాదిగా ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యులు స్థానిక ప్రజలు పాల్గొనడంతో గర్జన ఊహించినదానికంటే విజయవం తమైంది. ఈ సమావేశంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు సిహెచ్‌ నర్సింగరావు, జె.అయోద్యరామ్‌, డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌, గందం వెంకటరావు, బొడ్డు పైడిరాజు, వై.మస్తానప్ప, విల్లా రామ్మోహన్‌ కుమార్‌, వరసాల శ్రీనివాసరావు తదితరులంతా పాల్గొని ప్రసంగించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement