Tuesday, April 30, 2024

మంత్రి గౌతమ్ రెడ్డి మృతిపై దిగ్భ్రాంతి.. సంతాపం తెలిపిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంపై ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గౌతమ్ మృతిపై విచారం వ్యక్తం చేస్తూ ఉపరాష్ట్రపతి ప్రకటన విడుదల చేశారు. గౌతమ్ రెడ్డి ఎంతో సౌమ్యులు, సంస్కారవంతులు, ప్రజా సమస్యల పట్ల అవగాహన, చేసే పని పట్ల నిబద్దత కలిగిన నాయకులని వెంకయ్య నాయుడు కొనియాడారు. గౌతమ్ రెడ్డి తాత గారి సమయం నుంచి ఆ కుటుంబంతో తనకు సాన్నిహిత్యం ఉందని గుర్తుచేసుకున్నారు. తానంటే ఎంతో అభిమానం చూపేవారని, అలాంటి వ్యక్తి చిన్న వయసులోనే దూరం కావడం బాధాకరమని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నానని ప్రకటనలో పేర్కొన్నారు.

బాధాకరం : కిషన్ రెడ్డి
మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంపై కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సోమవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, కుటుంబ సభ్యులకు తన తరఫున, పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిన్న వయస్సులో నైతిక విలువలతో కూడిన రాజకీయం చేశారని, గత మూడేళ్లుగా రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. సౌమ్యుడు, నిజాయితీపరుడైన గౌతమ్ రెడ్డి అతి చిన్నవయస్సులోనే స్వర్గస్తులు కావడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement