Sunday, May 5, 2024

కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తుమ్మల

కమ్మ సామాజిక వర్గంలో ఉన్న పేదలను గుర్తించి వారికి కూడా సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్ధేశ్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. ఆ లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తుమ్మల చంద్రశేఖర్ రావు (బుడ్డి) పై ఉందని తెలిపారు. బుధవారం విజయవాడ కానూరులో ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తుమ్మల చంద్రశేఖర్ రావు(బుడ్డి) ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, కమ్మ వారిలో ఉన్న పేదలకు ఈ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంటేనే కులాలు, మతాలకు అతీతంగా వ్యక్తులను గుర్తించి వారికి పదవులు ఇస్తారన్నారని, ముఖ్యమంత్రి కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తున్నారన్నారు. కార్పొరేషన్ అంటే కుల సంఘం కాకూడదని, ఆ కులంలో ఉన్న పేదల అభివృద్ధి కోసం పనిచేయడం తప్ప కులాల ఫీలింగ్స్ రాకూడదని తెలిపారు.

తుమ్మల చంద్రశేఖర్ రావుతో ప్రమాణ స్వీకారం చేయించిన సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ 10 సంవత్సరాల పాటు పార్టీ కోసం వివిధ రకాలుగా ఇబ్బందులు పడ్డ వారిని గుర్తించి పదవులు ఇచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. కమ్మ కులం వారిని ఓట్లు, నోట్లు గా భావించిన వ్యక్తులను గతంలో చూశామని, కాని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కమ్మ కులంలో కూడా చిన్ని, చిన్న ఉద్యోగాలు చేసుకునే వారు, పేదలు కూడా ఉన్నారని గుర్తించి కమ్మ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన తోడ్పాటును అందుకొని కమ్మ కులంలోని పేదవారికి ఆర్థికంగా చేయూతను అందించాల్సిన బాధ్యత చైర్మన్ పై ఉందన్నారు. కమ్మ వారంటే అందరూ డబ్బున్న వారే కాదని, ఆ కులంలో కూడా పేద, మధ్యతరగతి వారు కూడా ఉన్నారని సీఎం జగన్ గుర్తించారన్నారు.

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ 135 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా, ఆయా కార్పొరేషన్ల చైర్మన్ల కు ఒక గుర్తింపు, హోదా ఇచ్చారని, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 25 సంవత్సరాల పాటు ఉంటారన్నారు.

పర్యాటక, సాంస్కృతిక, యువజన వ్యవహారాల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి) మాట్లాడుతూ అన్ని వర్గాలను, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షిస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందించటానికి ముఖ్యమంత్రి ఎల్లవేళలా పాటుపడుతున్నారన్నారు.

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఒక చారిత్రాత్మక నిర్ణయమని,సామాజిక వర్గాలలో వ్యక్తుల వెనుక బాటుతనాన్ని గుర్తించి ముఖ్యమంత్రి కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల కమ్మ కులంలోని పేదవారికి సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. 

- Advertisement -

బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వజ్ర సంకల్పంతో పేదలు ఎక్కడ ఉన్నా వారిని గుర్తించి అభివృద్ధి చేయటానికి సంకల్పించారని, అగ్ర కులాల్లోని పేదవారిని కూడా గుర్తించి వారిని అభివృద్ధి పథంలో నడిపించటానికి కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, జగన్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ కార్పొరేషన్ పై ఉందన్నారు.   

మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక కులానికో, మతానికో చెందిన వ్యక్తి కాదని, కులాలకు, మతాలకు అతీతంగా ఎంతో మంది సామాన్యులకు కూడా పదవులను అందించి తన మార్కును చూపించారన్నారు.

రాష్ట్ర కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ రావు  మాట్లాడుతూ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా తనను నియమించినందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారన్నారు. కమ్మ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంతో  రాష్ట్రంలో నాకో గుర్తింపు వచ్చిందన్నారు. తాను ఓ కులానికో ఓ మతానికో చెందిన వ్యక్తిని కాదనన్నారు. కమ్మ సామాజిక వర్గంలో పేద మధ్యతరగతి వారు అనేక ఇబ్బందులు పడుతున్నారని, కమ్మ కులంలో ఎక్కువగా వ్యవసాయ ఆధారంగా జీవించేవారేనని ఆయన అన్నారు. కమ్మ సామాజిక వర్గంలో పేదలందరికీ ప్రభుత్వం నుండి రావాల్సిన సంక్షేమ పథకాలు అన్నివారికి అందేలా కృషి చేస్తానని, తనపై నమ్మకంతో సీఎం జగన్ ఇచ్చిన బాధ్యతకు వంద శాతం న్యాయం చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కొలుసు పార్థసారథి అధ్యక్షత వహించగా, ఉప-ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, ముఖ్యమంత్రి కార్యక్రమాల నిర్వహణ సలహాదారులు తలశిల రఘురామ్, దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మంత్రులు తానేటి వనిత, శ్రీరంగనాథ రాజు, ప్రభుత్వ విప్ ఉదయ బాను, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చైర్ పర్సన్ రాయన భాగ్యలక్ష్మి, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఆసిఫ్ భాషా, శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్, అబ్బయ్య చౌదరి,  వసంత కృష్ణ ప్రసాద్, మల్లాది విష్ణు, శ్రీ రక్షణ నిధి, జోగి రమేష్, మేరుగ నాగార్జున, డాక్టర్. జగన్ మోహన్ రావు, డాక్టర్. వల్లభనేని వంశీ మోహన్, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ తాతినేని పద్మావతి లు పాల్గొని, కొత్త చైర్మన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement