Saturday, May 4, 2024

AP: త్వరలో 12లక్షల ఎకరాలకు విస్తరించనున్న టైగర్ జోన్.. మంత్రి పెద్దిరెడ్డి

తిరుపతి, (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : రాష్ట్రంలో ఉన్న శ్రీశైలం – నాగార్జున సాగర్ టైగర్ జోన్ పరిధిని 12 లక్షల ఎకరాలకు విస్తరించడానికి కృషి జరుగుతోందని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. ఈరోజు ఉదయం స్థానిక ఎస్వీ జూపార్క్ లో గ్లోబల్ టైగర్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ సందర్బంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ… మన రాష్ట్రం పులుల సంరక్షణలో గణనీయంగా అభివృద్ధి సాధించిందని, శేషాచల, నల్లమల అభయారణ్యాలను కలుపుతూ కారిడార్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత 2010లో 45 పులులు నేడు రెట్టింపుతో 80కి పైగా వున్నాయన్నారు. పులులు పెరగడం వల్ల అటవీ సంపద దోచుకునే వారికి భయం వుంటుందని అన్నారు.


శేషాచల అభయారణ్యంలో నేడు పెద్ద పులులు లేవని, అయితే మామండూరు వద్ద గెస్ట్ హౌస్ నందు బ్రిటిష్ వారు వేటాడినట్లు రికార్డ్స్ చెబుతున్నాయని తెలిపారు. నల్లమల, శేషాచల అభయారణ్యంలు కలుపుతూ కారిడార్ ఏర్పాటుతో అటవీ సంరక్షణకు దోహదపడుతుందన్నారు. పులుల సంరక్షణకు రష్యాలోని జరిగిన సమావేశంలో బీజం పడిందని, ఆనాటి నుండి ప్రతీ ఏడాది జులై 29న గ్లోబల్ టైగర్ డే జరుపుకుంటున్నామన్నారు. గత 12సంవత్సరాల ముందు అటవీశాఖ మంత్రిగా ఉన్న సమయంలో పులుల లెక్కింపునకు శ్రీశైలంలో చిన్నపాటి లాబ్ పింగర్ ప్రింట్ ఆధారంగా చేసేవారని, ఇప్పుడు శాస్త్రీయంగా కచ్చితంగా లెక్కించడానికి స్టిల్, వీడియో, డ్రోన్ వంటి కెమెరాలు వున్నాయన్నారు. శ్రీశైలం నాగర్జునసాగర్ టైగర్ జోన్ ఇప్పుడు 8లక్షల ఎకరాల్లో వుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో 5 లక్షల ఎకరాలు జోన్ పరిధి పెంచేలా ప్రతిపాదనలు చేశారన్నారు.

అనతి కాలంలోనే ఈ జోన్ ప్రముఖ స్థానంలో నిలుస్తుందన్నారు. ఎన్ ఎస్ టి ఆర్ పుస్తకం, పోస్టర్ ఆవిష్కరణ చేశారు. వివిధ వకృత్వ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, అటవీ సంరక్షణలో ప్రతిభ కనబరిచిన అటవీ అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ముందుగా ఎస్వీ జూపార్క్ లో పర్యాటకులకు కొత్తగా ఏర్పాటు చేసిన బజాజ్ బ్యాటరీ స్కూటర్ లను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అటవీ అధికారులు ఉపయోగించే ఆయుధాల స్టాల్స్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్య అటవీ సంరక్షణధికారి మధుసూధన్ రెడ్డి, అదనపు సంరక్షణాధికారి శాంతిప్రియ పాండే, సీసీఎఫ్ నాగేశ్వర రావు, జూపార్క్ క్యూరేటర్ సి.సెల్వం, స్టేట్ సిల్వికల్చరిస్ట్ యశోదా బాయ్, తిరుపతి డిఎఫ్ఓ సతీష్ రెడ్డి, విద్యార్థులు, అటవీ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement