Friday, May 17, 2024

Cuddapah | అన్న‌కు అద్దం గిఫ్ట్… జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు ఫోబియా ప‌ట్టుకుంద‌న్న : ష‌ర్మిల

కడప – ముఖ్యమంత్రి జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. కడపలో ఇవాళ ఆమె మాట్లాడుతూ, తనపై జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుతో నేను చేతులు కలిపానని ఏ ఆధారాలతో చెబుతున్నారు అంటూ నిలదీశారు. చంద్రబాబుతో ఈ వైఎస్సార్ బిడ్డ చేతులు కలిపిందని నిరూపించాలని సవాల్ విసిరారు.

“చంద్రబాబు చెబితే నేను కాంగ్రెస్ లో చేరానని అంటున్నారు. మరి ఆనాడు చంద్రబాబు చెబితేనే జగన్ కోసం పాదయాత్ర చేశానా? సునీత కూడా చంద్రబాబుతో చేతులు కలిపారని అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు మాట వింటారని చెబుతున్నారు. చంద్రబాబు ఎంతో పవర్ ఫుల్ అని చెబుతున్నారు… ఏం జరిగినా చంద్రబాబే కారణమని అంటున్నారు. జగన్ కు చంద్రబాబు పిచ్చి పట్టుకున్నట్టుంది.

జగన్ మానసిక స్థితి గురించి నాకు భయం వేస్తోంది… అద్దంలో చూసుకుంటే జగన్ కు చంద్రబాబు ముఖమే కనబడుతోందా? అందుకే జగన్ కు ఓ అద్దం పంపుతున్నా. ఈ అద్దంలో జగన్ తనను తాను చూసుకోవాలి. అద్దంలో తానే కనిపిస్తున్నారో, చంద్రబాబు కనిపిస్తున్నారో చెప్పాలి” అని షర్మిల అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement